తాడిపత్రి నుచి అనంతపురం వెళ్తున్న రోడ్డులో ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ ఆటో బోల్తా పడింది. అందులో చాలా మంది గాయపడ్డారు. కానీ ఓ యువతి మాత్రం తీవ్రంగా గాయపడింది. పిలిస్తే పలకడం లేదు. అపస్మారక స్థితిలో లేదు. చాలా మంది ఆ దారి వెంబడి వెళ్తున్నారు. కానీ యువతి పరిస్థితి ఎవరి అర్థం కావడం లేదు. 
ఇంతలో ఆ దారి వెంట వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆగింది. గ్లాస్ దించారు. చూస్తే అందులో ఉంది తాడిపత్రి పెద్దాయన జేసీ దివాకర్‌రెడ్డి. అక్కడ ప్రమాదం జరిగిందని గుర్తించి కారు పక్కకు ఆపి దిగారు. అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని తట్టిలేపారు. ఆమె స్పందించలేదు. 
ఆ యువతి దుస్థితి చూసిన జేసీ దివాకర్ రెడ్డి వేరే మాట మాట్లాడకుండా ఆమెన తన కారులో ఎక్కించుకున్నారు. వీలైనంత వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని తన డ్రైవర్‌కు చెప్పారు. అంతే డ్రైవర్ క్షణాల్లో అనంతపురం ప్రభుత్వాసుపత్రి ఎదుట జేసీ దివాకర్‌రెడ్డి కారు ఆగింది. అప్పటికే సమాచారం అంది ఉండటంతో డాక్టర్, నర్సులు స్ట్రెచ్చర్‌తో రెడీగా ఉన్నారు. 


తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడి ఉన్న యువతిని హుటాహుటిన ఐసీయులోకి తీసుకెళ్లి చికిత్స ప్రారంభించారు. వేరే పని ఉండటంతో తన సహాయకుడిని ఆసుపత్రి వద్దే ఉండమని చెప్పి జేసీ దివాకర్‌ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమెకు మెరుగైన వైద్యం చేయాలని వైద్యులకు కూడా సూచించారు. 


జేసీ దివాకర్‌ రెడ్డి కారులో వెళ్తుండగానే ఆసుపత్రి నుంచి తన అసిస్టెంట్ ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసిన దివాకర్‌రెడ్డి అవునా అని అడిగారు. అయ్యో పాపం అన్నారు. కారును డ్రైవర్ చేస్తున్న వ్యక్తి ఏమైందని అడిగితే... మన ప్రయత్నం ఫలించలేదు. ఆ యువతి మృతి చెందిందని చెప్పారు. 


చికిత్స ప్రారంభించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ యువతి కన్నుమూసింది. ఆ మరణ వార్త విన్న జేసీ దివాకర్‌  రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదంలో గాయపడిన వాళ్ల స్వగ్రామం బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి అని పోలీసులు తెలిపారు. 


ప్రమాదంలో ఉన్న వారిని ఏదో పరామర్శించి వెళ్లిపోకుండా రక్తసిక్తమైన ఉన్న యువతిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లడే కాకుండా దగ్గరుండి చికిత్స చేయించడం ప్రశంసలు అందుకుంది. ఆయన ప్రయత్నం ఫలించి యువతి కోలుకొని ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది అంటున్నారు జేసీ అనుచరులు.