Janasena On Gudivada Amarnath : జనసేనపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్ వేడి ఇంకా చల్లారలేదు. జనసేనకు ఓ కులాన్ని ఆపాదిస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు, నేతలు మండిపడుతున్నారు. మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై తిరుపతి‌ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ స్పందించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ బాలనటుడని కిరణ్ రాయల్ విమర్శించారు.  సీఎం జగన్ చెప్పే సామాజిక న్యాయం వైసీపీకి వర్తించదా అని ప్రశ్నించారు.  


గుడివాడ అమర్నాథ్ బాలనటుడు


వైసీపి మంత్రులు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ విమర్శించారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ అధికార పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పే సామాజిక న్యాయం వైసీపీకి వర్తించదని, జగన్ సామాజిక వర్గాన్ని తన ఇంటి లోపలికి పిలిపించుకొని, ఇతర కులాల వారిని గుమ్మం ముందే ఉంచుతారని ఆయన విమర్శించారు. గుడివాడ అమర్నాథ్ పని చేయకుండా, పవన్ ను విమర్శించడమే డ్యూటీగా పెట్టుకున్నారని ఆరోపించారు. అమర్నాథ్ బాల నటుడు అనుకుంటున్నాడని, జగన్ అవార్డులు ఏమి ఇవ్వరన్నారు.  గుడివాడ అమర్నాథ్ కాపు కులంలో పుట్టి, జగన్ కి కాపలాగా మారారని విమర్శించారు. మహిళలు జనసేన వైపు ఉన్నారని, వైసీపీ అంటే చీదరించుకుంటున్నారన్నారు.  ఈ విషయం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గమనించాలన్నారు. వైసీపీలో బట్టలు ఊడ దీసుకొని షోలు చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం మహిళల దగ్గర వెళ్తే తెలుస్తుందని తిరుపతి‌ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు. 


కులాల చుట్టూ రాజకీయాలు


ఏపీలో రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు, పదవులు కేటాయింపుల్లో సామాజికవర్గాల గురించి చర్చించేవారు. కానీ ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు నేరుగా కొన్ని కులాల పేర్లను పెట్టి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీపై విమర్శలు చేసేందుకు కొన్ని కులాల పేర్లను జనసేనకు అంటించేశారు. పవన్  కల్యాణ్  ది  కాపు  జనసేన  కాదు...కమ్మ  జనసేన అని ఎద్దేవా చేశారు. నాదెండ్ల   డైరెక్షన్  లో  నడిచేది  కమ్మ  జనసేన అని, కాపులు  పవన్  ను   ఓన్  చేసుకునే  పరిస్థితి  లేదని విశాఖలో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.  


వైసీపీది బ్రిటీష్ డీఎన్ఏ 


 కాపు కాదు కమ్మ జనసేన అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ మండిపడింది. వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లో  బ్రిటీష్ రక్తం ప్రవహిస్తోందని... వారి ఆలోచనలు, పని తీరు మొత్తం కులాల మధ్య చిచ్చు పెట్టు విభజించి పాలించు అనే ధోరణిలో ఉన్నాయని జనసేన పార్టీ విమర్శించింది. బ్రిటీష్ డీఎన్ఏ ఎక్కించుకున్న వైసీపీ పార్టీ కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. కమ్మ, కాపుల మధ్య చిచ్చుపెట్టేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెట్టుబడులు, ఐటీ పాలసీల గురించి మాట్లాడాల్సిన మంత్రి కులాల గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు.  


Also Read : మెగస్టార్ బర్త్‌డే రోజున జనసేన కీలక భేటీ- కేడర్‌కు ఏం చెప్పబోతున్నారు?


Also Read : Pawan Kalyan: వాళ్లకీ యాప్ ఉండాలట! పవన్ కల్యాణ్ డిమాండ్ - సీఎం జగన్‌పై సెటైరికల్ కార్టూన్