Jagan Govt – Byjus :  వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం విద్యార్థులకు పంచుతున్న బైజూస్ ట్యాబ్లెట్స్ అంశంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి  రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబ్ ల కొనుగోలులో రూ.221 కోట్ల అవినీతి జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు లెక్కలు చెబుతున్నారు.కానీ టెండరింగ్ పద్దతిలో వైసీపీ ప్రభుత్వం 5.19 లక్షల ట్యాబ్ల కొనుగోలులో రూ.187 కోట్లు ఆదా చేశామని చెబుతోంది.  


డిసెంబర్ 21న  బాపట్ల జిల్లా యడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్..ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు రూ.32 వేల విలువైన ప్రీ అప్ లోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.1466 కోట్లు కాగా, టెండరింగ్ పద్దతి ద్వారా రూ.187 కోట్లను ఆదా చేసిందని విద్యాశాఖ చెబుతోంది. టీడీపీ నేత కె. పట్టాభిరామ్‌ విద్యాశాఖ ప్రతిష్ట దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ ఆరోపిస్తోంది. పేద విద్యార్థులకు డిజిటల్ చదువులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు తూట్లు పొడిచేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో పట్టాభి తప్పుడు ఆరోపణలు చేయడాన్ని  విద్యాశాఖ ఖండించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్‌లో లెక్కలను చూపించారు. 


ట్యాబ్ ధర అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో రూ.14,500 ఉండగా.. టెండర్ ప్రక్రియ ద్వారా ఒక్కో ట్యాబ్ కు రూ.12,843 ధరకే కొనుగోలు చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. ఈ కామర్స్ సంస్థ  అమెజాన్ ధర కంటే ఇది రూ3,603 (22%) తక్కువ. ట్యాబ్‌తో పాటు, ఫ్లిప్ కవర్, 64 జీబీ మెమరీ కార్డ్, ఓటీజీ కేబుల్ మూడేళ్ల వారంటీ కార్డ్‌తో సహా అనేక అదనపు వస్తువులను కూడా విద్యార్థులకు అందించినట్లు విద్యా శాఖ తెలిపింది. అంతేకాకుండా, మండల ప్రధాన కార్యాలయం వరకు రవాణా ఖర్చు కూడా ఈ ధరలోనే కలిపి ఉంటుందని తెలిపింది. ట్యాబ్ ల కొనుగోలు కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో నాలుగు జాతీయ మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు పాల్గొన్నాయని మరియు టెండర్ అవార్డులో ఎటువంటి పక్షపాతం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. 






ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..డిసెంబర్ 21న  బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు,  59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా అందిస్తారు.