AP High Court New Chief: ఆంధ్రప్రదేశ్, బాంబే హైకోర్టులకు నూతన ప్రధాన జడ్జిలను నియమించారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నియామకం అయ్యారు. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇలా వీరి నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్, బాంబే హైకోర్టు నూతన జడ్జిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను నియమించాలని జులై 5వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.


ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదోన్నతి రావడంతో.. 


ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రస్తుతం బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో జస్టిస్ ఏవీ శేషసాయి ఏపీ హైకోర్టులో తాత్కాలిక జడ్జిగా నియమితులు అయ్యారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సొంత రాష్ట్రం జమ్మూ కశ్మీర్. అయితే 2013 మార్చి 8వ తేదీన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జమ్ము కశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. అనంతరం బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 


ఇటీవలే తెలంగాణ హైకోర్టు కొత్త జడ్జీలు


తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు నియమితులయ్యారు. రాష్ట్రానికి కొత్త సీజే నియామకం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే నియమితులయ్యారు. జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు జడ్జిగా సేవలు అందిస్తున్న మరో జడ్జి జస్టిస్‌ సామ్‌ కొశాయ్‌ తెలంగాణ హైకోర్టు జడ్జిగా ట్రాన్స్ ఫర్ అయ్యారు. పలువురు జడ్జిల బదిలీలకు సుప్రీం కోర్టు కొలీజియం జులై 5న సిఫారసు చేయడం తెలిసిందే. మొత్తం ఐదుగురు జడ్జిల బదిలీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 


4 రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం.. 


తెలంగాణ హైకోర్టుతో పాటు కేరళ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియించినట్లు ప్రకటించింది. ఈ వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సునితా అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా సేవలందిస్తున్నారు.  కేరల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆశిష్ జే దేశాయ్ నియమితులయ్యారు. వారు ప్రస్తుతం గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్నారు. ఒడిశా హైకోర్టు సీజేగా సుభాషిస్ తలపత్ర నియమితులు కాగా, ప్రస్తుతం అదే కోర్టులో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒడిశా హైకోర్టు ప్రస్తుత సీజే ఎస్ మురళిధర్ ఆగస్టు 7న రిటైర్మెంట్ కానున్నారు.