ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి దావోస్‌కు వెళ్లిన సీఎం జగన్ రూ. లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులకు ఎంపీవోయూలు చేసుకున్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం దావోస్‌ వేదికగా చక్కటి ఫలితాలు సాధించిందని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగోతరం పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. పంప్డ్‌ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతోందని ప్రభుత్వం తెలిపింది. 


ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగంలోకి మిట్టల్ !


గ్రీన్‌ కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్‌ మిట్టల్‌ ప్రకటించింది. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్‌ తదితర రంగాల్లో ఉన్న 7 ఆర్సిలర్‌ మిట్టల్‌ గ్రూపు తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది.  కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తులపైనా దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారు.


మచిలీపట్నంలో ఎస్‌ఈజడ్ ! 


గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్‌ఈజెడ్‌ను తీసుకురానుండడం దావోస్‌ ఫలితాల్లో ఒకటని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్‌ను అభివృద్ధి చేస్తారు.


ప్రపంచ ఆర్థిక వేదికతో ఒప్పందం ! 


కాలుష్యాన్ని తగ్గించడం.. పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు పెద్దపీట వేయడం, గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారాన్ని అందిస్తుంది. 


ఏపీకి బైజూస్ కూడా ! 


దస్సాల్ట్‌ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో లాజిస్టిక్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు.  ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని.. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని బైజూస్‌ ప్రకటించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్‌ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ ప్రకటించింది.  రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దావోస్‌ వేదికగా విశేష కృషిచేశారు.