CBI Ex Director on Chandrababu Arrest :  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ వ్యవహరించిన విధానాన్ని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు తప్పు పట్టారు. అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించే విధానంలో నిబంధనలు పాటించలేదన్నారు.  ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పూర్తి వివరాలు పంచుకున్నారు. 


సీఐడీ అధికారులు Crime No. 29/2021under sections 120B, 166, 167, 418, 420, 465, 468, 471,, 409, 201, 109 read with 34, 37 IPC and 12, 13(2) read with 13(1)(c) & (d) of Prevention of Corruption Act, 1988 of CID Police Station, Mangalagiri.  పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన అరెస్ట్ మెమో ప్రకారం.. ఆయన అరెస్ట్ నిబంధనల ప్రకారం జరగలేదన్నారు. ఈ కేసులో వాస్తవాలు తనకు అందుబాటులో లేనందున తపొప్పుల గురించి మాట్లాడటం లేదని కేవలం అరెస్ట్ సహేతుకంగా చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్న దాని గురించి మాత్రమే మాట్లాతున్నా అన్నారు 


 





అరెస్టు చట్టబద్దమేనా…?
అవినీతి నిరోధక చట్టం-1998కి 2018లో సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిందని.. అందులో కొత్తగా 17(A) నిబంధనను పొందుపరిచారని ఆ విషయాన్ని సీఐడీ పరిగణనలోకి తీసుకున్నట్లు లేదన్నారు. అధికారిక  విధుల నిర్వహణ, సిఫారసులలో జరిగిన నేరాలకు  సంబంధించి  ప్రజా సేవకులు, ప్రభుత్వ ఉద్యోగులను విచారించడం  గురించి 17 (A) తెలుపుతుంది. ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు.. తమ విధుల నిర్వహణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై ముందస్తు అనుమతి లేకుండా విచారణ, దర్యాప్తు చేయడానికి వీలులేదని ఈ నిబంధన చెబుతుంది. 
• కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగి లేదా కేంద్ర ప్రభుత్వ విధుల్లోని ప్రజాప్రతినిధులు
• రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగి, లేదా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు
• ఏదైనా వ్యక్తిని, తప్పు జరిగిందనే ప్రాతిపదికన పై స్థాయి వ్యక్తులు తొలగించడానికి సిద్ధమైన తరుణంలో ముందస్తు అనుమతి తప్పనిసరి. 


“చంద్రబాబు అరెస్టు మెమోలో ప్రస్తావించిన నేరారోపణలు, సెక్షన్లు అన్నీ ఆయన ముఖ్యమంత్రిగా నిర్వహించిన ప్రభుత్వ విధులు.. సిఫారసుల పరిధిలోకి వస్తాయని.. ఆయనపై  చర్యలు, దర్యాప్తునకు గవర్నర్ అనుమతి తప్పనిసరి” అని నాగేశ్వరరావు పేర్కొన్నారు. 


పై నిబంధనలు అనుసరించి.. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. 


అరెస్టులో సహేతుకత కూడా లేదు
ప్రజాప్రతినిధుల అవినీతిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులన్నీ డాక్యుమెంట్ ఎవిడెన్సుతో ఉంటాయి. ఇలాంటి కేసులలో సాధారణంగా ముందస్తు అరెస్టులు చేయరు. ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు దర్యాప్తునకు సహకరించకపోయినా.. దర్యాప్తు అధాకారుల నోటీసుల ప్రకారం విచారణకు హాజరుకాకపోయినా.. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నా.. సాక్షాలను మాయం చేస్తున్నటువంటి సందర్భాల్లో మాత్రమే అరెస్టు చేస్తారు. “విచారణ అధికారి నోటీసు ఇచ్చి ఫలానా తేదీలో విచారణకు రమ్మంటారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ అలాంటి నోటీసు ఏమీ ఇచ్చినట్లు  కనిపించడం లేదు. 2021 లోనే నమోదైన ఈ కేసులో ఎలాంటి నోటీసూ లేకుండా చంద్రబాబును అంత అర్జెంట్ గా అరెస్టు చేయడం సహేతుకంగా  కనిపించడం లేద”న్నారు. 


ఈ కేసు 2021లో మొదలైంది కాబట్టి చంద్రబాబుపై విచారణ ప్రారంభించడానికి ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాలని అంటే అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ అనుమతి ఉండాలని.. ఒకవేళ చంద్రబాబు పాత్రపై ఈ మధ్యే సమాచారం తెలిసిందని చెప్పినా.. ఇప్పటి గవర్నర్ అనుమతి తప్పకుండా ఉండాలని ఆయన “ఏబీపీ దేశం” తో చెప్పారు.