NTR's Priesthood For A marriage :  ఎన్టీఆర్‌ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన స్వయంగా పెళ్లి జరిపించేంతటి పౌరహిత్య పాండిత్యం కూడా ఆయన సొంత మని చాలా మందికి తెలియదు. ముఖ్యమంత్రి హోదాలో ఓ పెళ్లికి వెళ్లిన ఆయన ... పురోహితుడ్ని విశ్రాంతి ఇచ్చేసి తానే పెళ్లి జరిపించేశారు. ఈ అరుదైన ఘటన విశేషాలు ఇవి. 


నాగభైరవ కోటేశ్వరరావు కుమారుని పెళ్లి సందర్భం !
 
జూలై 7, 1988... ఉదయం 6గంటల 40 నిమిషాలకు వివాహ ముహూర్తం... ఒంగోలు పట్టణం రాంనగర్‌లోని టొబాకో సంస్థ ప్రాంగణంలో కళ్యాణ వేదిక. ఆ ప్రదేశమంతా పది వేల మంది జనాభాతో కిక్కిరిసిపోయి ఉంది. ఆ క్షణం అందరి కళ్లు ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. వారంతా వధూవరుల బంధుమిత్రులు కారు. ఆ పెళ్లికి అతిథిగా హాజరవుతున్న తమ ప్రియతమ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును కనులారా చూసిపోదామని అక్కడికి విచ్చేసిన జనవాహిని. ముహూర్తం సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో సీఎం ఎన్టీఆర్  వివాహ మండపంలోకి అడుగుపెట్టారు. వధూవరులను ఆశీర్వదించడానికి హాజరైన ఎన్టీఆర్‌ ‘‘కవి గారూ’’ అంటూ పెళ్లికుమారుడి తండ్రి అయిన నాగభైరవ కోటేశ్వరరావు  ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పారు. అంతే... అక్కడ సీన్‌ మొత్తం మారింది...


పురోహితుని స్థానంలోకి ఎన్టీఆర్ !


అప్పటిదాకా వేదికపై ఉన్న పురోహితుడు వేదిక దిగాడు. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ ఆశీనులయ్యారు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సర్వత్రా ఏం జరగబోతోందనే ఉత్కంఠ. ఎన్టీఆర్‌ మైక్‌ అందుకున్నారు. ‘‘సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాల అర్థం వీరికి తెలీదు. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి వివరించే ఆ మంత్రాల పరమార్థాన్ని మనకు అర్థమైన తెలుగులో చెప్పి ఈ పెళ్లి నేనే జరిపిస్తాను’’ అన్నారు. దీంతో పెళ్లికి హాజరైన వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. 


ఆ తర్వాత ‘నందమూరితో నా అనుభవాలు’ పేరుతో నాగభైరవ కోటేశ్వరరావు పుస్తకం రాశారు. అందులో తన కుమారుడి పెళ్లిక ఎన్టీఆర్ చేసిన పౌరోహిత్యం గురించి కూడా గుర్తు చేసుకున్నారు. పెళ్లి కుమారుడు నాగభైరవ వీరబాబు అయితే ఆ గంట సేపు ఏం జరిగిందో నమ్మలేకపోయామన్నారు. ‘‘మా నాన్న నాగభైరవ కోటేశ్వరరావు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాకు మాటల రచయితగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో 60 రోజులు కలిసి ఉన్నారు కూడా. సాహిత్యాభిలాషి, తెలుగు భాషా ప్రేమికుడైన ఎన్టీఆర్‌ మా నాన్నను ప్రేమగా ‘కవిగారు’ అని పిలిచేవారు. ఆయనపై ఉన్న ఆత్మీయతతో ఆహ్వానించగానే నా పెళ్లికి విచ్చేశారు. అప్పుడు మా జిల్లా కలెక్టరుగా డా. జయప్రకాశ్‌ నారాయణ ఉన్నారు. ఎన్టీఆర్‌ను దగ్గరి నుంచి చూస్తే చాలనుకునేవాళ్లం. అలాంటిది ఆయనే స్వయంగా నా పెళ్లి జరిపిస్తుండటంతో ఆ సమయంలో ఏదో తెలియని భావన నాలో కలిగింది. ఆ తన్మయత్వంలో గంటసేపు ఏం జరిగిందో కూడా గుర్తులేదు ’’ అని నవ్వుతూ చెప్పేవారు.


 ఆ రోజు సంఘటనను వీరబాబు సతీమణి పద్మజ కూడా అబ్బురంగా గుర్తు చేసుకుంటారు.  ‘‘అప్పుడు నాకు 19 ఏళ్లు. కళ్యాణ మంటపం మీద మేమిద్దరం, తాతయ్య, ఎన్టీఆర్‌... అంతే. ఇంకెవ్వరినీ అనుమతించలేదు. వివాహవ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపది, తాళి పరమార్థాన్ని అచ్చమైన తెలుగులో వివరించారాయన. మా చేత పెళ్లి ప్రమాణాలు చేయించారు. ‘ఆ! మేలగాళ్లు కానివ్వండి.!’’ అంటూ ఆయనే స్వయంగా బాజాభజంత్రీలను పురమాయించారు. ఎన్టీఆర్‌ గారు పెళ్లి మంత్రాలన్నింటినీ కంఠతా ఆలపించడం విశేషం. ఆయన పురోహితుడుగా వ్యవహరించిన తొలి, తుది పెళ్లి మాదే కావడం మాకు దక్కిన అదృష్టం’’ అని సంతోషపడుతూంటారు.  
 
కవిరాజు ‘వివాహ విధి’


త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన ‘వివాహ విధి’ గ్రంథం ఆధారంగా ఎన్టీఆర్‌ వివాహ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ వధూవరులతో ప్రమాణాలు చేయించారు. సప్తపది, జిలుకర బెల్లం, మంగళసూత్రధారణ౫ పవిత్రను, పరమార్థాన్ని వివరించి పెళ్లితంతు జరిపారు. అనంతరం వేదిక కింద ఉన్న అతిధులంతా అక్షితలను వధూవరులపైకి విసురుతున్నారు. అప్పుడు ‘‘మనమంతా అక్షింతలు అంటాం. కానీ అక్షితలు అనాలి. వాటిని వధూవరులపై దయచేసి అలా విసరకండి. ఒక్కొక్కరుగా వచ్చి నిండు మనస్సుతో నవ దంపతులను ఆశీర్వదించండి.!’’ అని సూచించారు. ఎన్టీఆర్‌ 45 నిమిషాల పాటు మండపంపై ఆశీనులై కళ్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని, దానివెనుకున్న పరమార్థాన్ని వివరిస్తూ పౌరహిత్యం చేశారు.


ఆ తర్వాత మరెవరికీ  పెళ్లి పెద్దగా ఉండని ఎన్టీఆర్ !


ఎన్టీఆర్ పౌరహిత్యం చేశాని తెలిసిన తర్వాత  ఆయన సన్నిహితులు చాలామంది పెళ్లి పెద్దగా హాజరవ్వాల్సిందిగా కోరారు.  స్తే ‘‘కవిగారిపై నాకున్న అభిమానంతో వారి కుమారుడి వివాహానికి పౌరోహిత్యం చేశాను. ఆ అవకాశం వారికి మాత్రమే సొంతం’’ అని అన్నట్లు ‘నందమూరితో నా అనుభవాలు’ పుస్తకంలో నాగభైరవ కోటేశ్వరరావు రాశారు.