RGV Interesting Comments about Vyuham Movie: విజయవాడ: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ వ్యూహం. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. తనను వైసీపీ మనిషి అంటున్నారని, అది నిజమేనన్నాడు ఆర్జీవీ (Director Ramgopal varma). ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఫేవర్ గానే వ్యూహం సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. విజయవాడలో నిర్వహించిన వ్యూహం ప్రి రిలీజ్ ఈవెంట్లో (Vyuham pre release event in Vijayawada) దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - 25 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేశాను. కానీ వ్యూహం సినిమా నేపథ్యం ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదే. ఇందులో కథ కంటే క్యారెక్టర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని డైరెక్టర్ వర్మ తెలిపారు.


రాజకీయ నాయకుల సైకాలజీ తెలుసు.. 
‘రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు బయటకు ఎలా కనిపిస్తారు, వెనక ఎలాంటి కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు పన్నుతారు అనేది నేను సైకలాజికల్ కోణంలో ఈ సినిమాలో తెరకెక్కించాను. నేను రాజకీయాల్లో లేకున్నా, రాజకీయ నాయకుల సైకాలజీని అర్థం చేసుకుంటాను. కాంటెంపరరీ ఇష్యూస్ ఉన్న వ్యూహం లాంటి మూవీ వరల్డ్ సినిమాలో రాలేదని చెప్పగలను. నారా లోకేష్ వ్యూహం సినిమాను ఆపమని కోర్టుకు వెళ్లి అందులో అతను చెప్పిన కారణం మమ్మల్ని కించపరుస్తున్నారని చెప్పాడు. కానీ రోజు లేచిన దగ్గర నుంచి లోకేష్ చేస్తున్న పని జగన్ ను కించపరచడం. అనేక మాటలు, ఆరోపణలు, విమర్శలు చేయడం. ఇలాంటి లోకేష్ తనను కించపరుస్తున్నారని వ్యూహం సినిమాను ఆపమని కోర్టుకు వెళ్లడం ఏంటి. ఎన్టీఆర్ ను చెడ్డవాడిగా చిత్రీకరించిన చంద్రబాబు మళ్లీ ఎక్కడ ఆయన అభిమానుల ఓట్లు పోతాయో అని చెప్పి ఎన్టీఆర్ ను మహానుభావుడు అనడం మొదలుపెట్టాడని’ దర్శకుడు వర్మ పలు విషయాలు ప్రస్తావించారు.


పవన్ కన్నా బర్రెలక్క బెటర్.. 
‘పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు ఇంప్రెస్ అయ్యా. కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు చూసి పవన్ మీద అభిమానం పోయింది. తెలంగాణలో బర్రెలక్క అనే ఒక అమ్మాయి ధైర్యంగా రాజకీయాల్లో నిలబడింది. అలాంటి ధైర్యం కూడా పవన్ కు లేదు. కొందరి చేతిలో కీలుబొమ్మగా మారాడు. కనీసం బర్రెలక్క బర్రెలను వాటిని కాపలాగా ఉంటుంది, వాటిని చూసుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఓ బర్రె, గొర్రెలాంటి వాడు. సొంతంగా ఆలోచన చేయలేని వ్యక్తి సూపర్ స్టార్ అంటూ’ జనసేన అధినేతపై ఆర్జీవీ సెటైర్లు వేశారు.


ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంతో వ్యూహం సినిమా ఉంటుందని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలిపారు. ఇందులో యదార్థ ఘటనల స్పూర్తిగా ఫిక్షనల్ కథను చూస్తారు. మన పేపర్స్, టీవీ, యూట్యూబ్ లో చూసిన విషయాలేవీ వ్యూహంలో ఉండవు. ఆ ఘటనల వెనక దాగి ఉన్న కుట్రలు, కుతంత్రాలు, నిజాలతో వర్మ వ్యూహం సినిమాను రూపొందించారని చెప్పారు. తండ్రి చనిపోయినప్పుడు జగన్ ఆ బాధలో ఉండగానే... కేంద్ర పాలకులతో కుమ్మక్కై కొందరు ఆయన జీవితంపై కుట్రలు చేసి, జైలుకు పంపారని ఆరోపించారు. జగన్ తన కుటుంబాన్ని భార్యా పిల్లల్ని వదిలి జైలు జీవితం గడిపారు. జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్రతో ప్రజల ప్రేమాభిమానాలు గెల్చుకున్నారు. ఇక్కడే ఇదే వేదిక మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేసుకున్నారు.


జీవితాంతం జగన్ సీఎంగా ఉండాలి.. 
‘జగన్ జీవితాంతం సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రమాణ స్వీకారం రోజు ప్రజలకు ఇచ్చిన మానిఫెస్టోను 99శాతం అమలు చేసిన ఘనత జగన్ సొంతం. వ్యూహం సినిమాను ఎంతో స్పష్టతతో, అవగాహనతో, అధ్యయనం చేసి వర్మ రూపొందించారు. వర్మతో నేను వంగవీటి అనే సినిమా చేశాను. ఇప్పుడు వ్యూహం సినిమాను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. ఈ సినిమాను ప్రజలకు చేర్చితే అదే ఘన విజయం అని భావిస్తా’ అన్నారు నిర్మాణ దాసరి కిరణ్ కుమార్.


Also Read: వ్యూహం టీజర్‌తో చంద్రబాబుకు చెమటలు, ట్రైలర్‌తో లోకేష్ పరుగులు - వైసీపీ