ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్త పీఆర్సీ అమలులో భాగంగా ఇంటి అద్దె అలవెన్సు (హెచ్ఆర్ఏ) విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం ఆశించిన ఉద్యోగులు కంగుతినాల్సి వచ్చింది. సోమవారం రాత్రి ఏపీ ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఉత్తర్వులను వరుసగా జారీ చేసింది. ఇందులో ఉద్యోగులు చేసిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా హెచ్ఆర్ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. అశుతోష్‌ మిశ్ర కమిటీ సిఫార్సులనూ పరిగణనలోకి తీసుకోకుండా సీఎస్‌ కమిటీ సూచనల మేరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగుల హెచ్ఆర్ఏలో కోత పడింది. సీసీఏను రద్దు చేసింది. మధ్యంతర భృతి చెల్లింపుల్లోనూ కోత విధించి డీఏ బకాయిల్లో సర్దుబాటుకు నిర్ణయం తీసుకున్నారు.


2019 జులై నుంచి 27 శాతం చెల్లించిన మధ్యంతర భృతి విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఫిట్‌మెంట్‌ 23 శాతాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. దీనివల్ల అదనంగా ఇచ్చిన 4 శాతం విలువకు సమాన మొత్తాన్ని బకాయిల నుంచి మినహాయించుకోవాలని నిర్ణయించింది. కొంత కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనగా.. ప్రభుత్వం 18 నెలల బకాయిలు ఇస్తామని అంగీకరించింది. అయితే, ఆ బకాయిల నుంచి ఈ మొత్తాన్ని మినహాయిస్తున్నట్లు మెలిక పెట్టింది.


సీసీఏ రద్దు
సీసీఏ (సిటీ కాంపన్సేటరీ అలవెన్సు) పేరుతో జమ అయ్యే మొత్తాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. పదేళ్లకు ఓకసారే పీఆర్సీ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. పింఛనర్లకు అదనపు మొత్తం పింఛను చెల్లించే వయసునూ ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేసింది. మరోవైపు 1.7.2019 నుంచి 31.12.2021 వరకు ఉద్యోగులకు, పింఛనర్లకు ఇవ్వాల్సిన 5 పెండింగు డీఏల అమలుకూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే వారికి అదనపు పింఛను లభిస్తుంది.


ఇంటి అద్దెలోనూ కోతే..
ప్రస్తుతం కొత్త పీఆర్సీ అమలు వల్ల తమకు జీతాలు పెరగకపోగా.. తగ్గిపోతున్నట్లే లెక్క అని ఉద్యోగులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన డీఏలు ఇప్పుడు ఇవ్వడం వల్ల కొంతమేర మొత్తం వేతనంలో పెరుగుదల కనిపిస్తున్నాయని అన్నారు. ఆ డీఏలన్నింటినీ ముందే కనుక ఇస్తే ఈ పీఆర్సీలో జీతాలు తగ్గిన విషయం అందరికీ స్పష్టంగా తెలిసేదని వివరిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడుతూ తాజాగా ఇంటి అద్దె భత్యంలో కోత పెట్టడం వల్ల ఇంతకుముందు తనకు వచ్చే హెచ్ఆర్ఏ రూ.12,290 కాస్తా ఇప్పుడు రూ.7,560కు తగ్గిపోనుందని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లోని ముఖ్యమైనవి..
* సవరించిన మాస్టర్‌ స్కేలులో 32 గ్రేడులు ఉంటాయి. 2018 జులై 1 నుంచి నోషనల్‌గా కొత్త పీఆర్సీ అమలవుతుంది. 2022 జనవరి నుంచి కొత్త జీతాల్లో పీఆర్సీ అమలు ప్రభావం ఉంటుంది. 2022 సవరించిన వేతన స్కేళ్లు నిర్ణయించే క్రమంలో మధ్యంతర భృతిని పరిగణనలోకి తీసుకోరు.


* గ్రాట్యుటీ పరిమితి రూ.16 లక్షలకు పెంచారు. అదే సమయంలో ఇక రాష్ట్ర పీఆర్సీకి మంగళం పాడారు.


* సెక్రెటేరియట్ ఉద్యోగులతో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఉద్యోగులకు 16 శాతం అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), మిగిలిన అందరికీ 8 శాతం అద్దె భత్యం వర్తిస్తుంది. ఆటోమేటిక్‌ అడ్వాన్సుమెంట్‌ స్కీం 6, 12, 18, 24తో 30గా కొనసాగింపు ఉంటుంది.


కేంద్ర ప్రభుత్వ తరహాలోనే కొత్త పీఆర్సీ బకాయిల చెల్లింపు ఇకపై ఇలా..
* 2004 తర్వాత నియమితులైన సీపీఎస్‌ ఉద్యోగులకు మధ్యంతర భృతి సర్దుబాటు చేసిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో నాలుగు సమాన త్రైమాసిక వాయిదాల్లో చెల్లిస్తారు. 2022 జూన్‌, సెప్టెంబరు, డిసెంబరు, 2023 మార్చి నెలల్లో చెల్లిస్తారు.


* అదే 2004కు ముందు ఓపీఎస్‌ విధానంలో ఉన్న ఉద్యోగులకు మధ్యంతర భృతిని సర్దుబాటు చేసిన తర్వాత బకాయిలను నాలుగు త్రైమాసికాల్లో ఉద్యోగుల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాల్లో జమచేస్తారు.


* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్కేళ్ల వర్తింపు ఉంటుంది. ఆ స్కేళ్లను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేర్వేరు కేటగిరీలకు వేర్వేరు స్కేళ్లను ఉత్తర్వుల్లో వివరించారు.


Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..


Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ


Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి