Chittoor News : కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందిన కేసులలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారి కుటుంబానికి ఎనిమిది లక్షలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.  చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరి 17న దీక్షిత అనే చిన్నారి మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యంతో కోడి గుడ్డు గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి దీక్షిత మృతి చెందింది. దీనిపై పాప తల్లిదండ్రులు అంగన్వాడీ సిబ్బందిని నిలదీశారు. పాప కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. అయితే అనారోగ్యంతో దీక్షిత మృతి చెందింది అంటూ అంగన్వాడీ సిబ్బంది బుకాయించారు. న్యాయం చేయాలంటూ దీక్షిత తల్లిదండ్రులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీక్షిత మృతదేహాన్ని ఖననం చేసిన 4 నెలల తర్వాత హెచ్ఆర్సీ ఆదేశం మేరకు పోస్టుమార్టం నిర్వహించారు. కోడిగుడ్డు గొంతులో ఇరుక్కోవడంతోనే దీక్షిత మృతి చెందింది అంటూ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడించింది. దీంతో దీక్షిత కుటుంబానికి 8 లక్షల పరిహారం ఇవ్వాలంటూ 2023 జనవరి 31న హెచ్ఆర్సీ ఆదేశించింది. హెచ్ఆర్సీ నిర్ణయంపై అంగన్వాడీ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. హెచ్ఆర్సీ తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై పాప తల్లిదండ్రులకు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని దీక్షిత తల్లిదండ్రులు సరిత, మురుగేష్ కోరుతున్నారు.


మరొకరికి జరగకూడదనే మా పోరాటం 


"మా పాపను అంగన్వాడీలో వదిలేసి కూలి పనికి వెళ్లాం. మధ్యాహ్నం 12.30కి మాకు ఫోన్ వచ్చింది. మీ పాప చనిపోయిందని చెప్పారు. ఇంటికి వచ్చి చూస్తే పాప విగతజీవిగా పడిఉంది. ఆ రోజు మాకు ఏంచేయాలో తెలియలేదు. రెండ్రోజుల తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కేసు తీసుకోలేదు.  మీ పాపకు గుండె జబ్బు, ఫిట్స్ ఉందని కేసు క్లోజ్ చేయించారు. మా పాపకు ఎలాంటి అనారోగ్యం లేదు. ఊర్లో పెద్దలతో మాట్లాడుకుని ధర్నా చేశాము. పేపర్ల వార్తలు వచ్చాక హ్యూమన్ రైట్స్ వాళ్లు మాకు కాల్ వచ్చింది. జరిగిన విషయం చెప్పాము. మేము వాళ్లకు లేటర్ పెట్టాము. హెచ్ఆర్సీ వాళ్లు మా ఇంటికి వచ్చి విషయంపై ఆరా తీశారు. రీపోస్టుమార్టమ్ చేశారు. హెచ్ఆర్సీ వాళ్లు చెప్పినట్లు కేసులు కూడా పెట్టాం. అయితే రీపోస్ట్ మార్టమ్ లో కూడా గుండె జబ్బు, ఫిట్స్ అని పోలీసులు చెప్పారు. దీనిపై హెచ్ఆర్సీని ఆశ్రయిస్తే వాళ్లు కేసులు పెట్టారు. ఇటీవల హెచ్ఆర్సీ నుంచి లెటర్ వచ్చింది. గుడ్డు తిని పాప చనిపోయిందని చెప్పారు. రూ.8 లక్షలు పరిహారం ఇవ్వాలని అంగన్వాడీ అధికారులను ఆదేశిస్తామన్నారు. అధికారులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. మేము ఇంతలా పోరాడింది డబ్బు కోసం కాదు. మాకు జరిగినట్లు మరొకరికి జరగకూడదన్నారు."- చిన్నారి తల్లి  సరిత 


ఇటీవలె మరో ఘటన 


 చిత్తూరు జిల్లాలో ఇటీవల అమానవీయ ఘటన వెలుగుచూసింది. గత నెలలో అంగన్వాడీ చిన్నారులను గదిలో బంధించి వేశారు. బైరెడ్డిపల్లి మండలం పాతూరునత్తం గ్రామంలో అంగన్వాడీ  కేంద్రంలో  చిన్నారులను  బంధించి తాళం వేశారు అంగన్వాడీ టీచర్,సిబ్బంది (ఆయా). గదిలో ఉన్న భయంతో ఏడుస్తుండడంతో స్థానికులు గమనించి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారుల అరుపులను విని తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్నారు. చిన్న పిల్లలపై శ్రద్ధ వహించని అంగన్వాడీ టీచర్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ పంతులమ్మ సొంత పనుల బిజీలో  పిల్లల శ్రద్ధను గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఈ అంగన్వాడీ కేంద్రంపై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. బైరెడ్డిపల్లి మండలంలో అంగన్వాడీ పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణ చేయడంలేదని తల్లిదండ్రులు అంటున్నారు.  గతంలో ఈ అంగన్వాడీ సెంటర్ లో పిల్లల పట్ల అశ్రద్ధ చూపుతున్న టీచర్ పై పత్రికల్లో కథనాలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.