Bendapudi Students :  అమెరికన్ యాక్సెంట్ లో  మాట్లాడి అదరగొట్టిన బెండపూడి విద్యార్థులకు మంచి గౌరవం దక్కింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారిన ఈ బెండ పూడి స్కూల్ విద్యార్థులు తాజాగా అమెరికన్ కాన్సులేట్ జనరల్ మెప్పును కూడా పొందారు.  వెల్డన్ బెండపూడి స్టూడెంట్స్...  అంటూ అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ డోనాల్డ్‌ హెప్లిన్‌ వారితో శుక్రవారం వెబ్‌ ఎక్స్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి అభినందనలు తెలిపారు. 


వెబ్ ఎక్స్ ద్వారా బెండపూడి విద్యార్థులతో యూఎస్ కాన్సులేట్ జనరల్ ముచ్చట


 విద్యాశాఖ ఆధ్వర్యంలో వెబ్‌ ఎక్స్‌ ద్వారా విద్యార్థులతో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ డోనాల్డ్‌ హెప్లిన్‌ మాట్లాడేందుకు బెండపూడి హైస్కూల్‌లో స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు మేఘన, రీష్మ, తేజస్విని, వెంకన్నబాబు సుమారు 20 నిమిషాలు పాటు  డోనాల్డ్‌ హెప్లిన్‌తో  మాట్లాడారు.  విద్యార్థులు, ఉపాధ్యాయులతో డోనాల్డ్‌ ముచ్చటించారు. అయితే డోనాల్డ్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న విద్యార్థులను ప్రశ్నించారు. ఎంత మందికి అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి ఉందని అడగ్గా విద్యార్థులంతా అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా సత్సంబంధాల అభివృద్ధికి  ఆంగ్లభాష వారధిగా నిలుస్తుందని  హెప్లిన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ దేశ యాక్సింట్‌లో అనర్గళంగా మాట్లాడేలా విద్యార్థులను  తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ప్రసాద్‌ మాస్టారును డోనాల్డ్  హెప్లిన్‌ ప్రత్యేకంగా అభినందించారు.


అమెరికాలో చదువుకునే ఆసక్తి ఉందా అని ప్రశ్నించిన యూఎస్ కాన్సులేట్ జనరల్


కాకినాడ జిల్లా బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు ఆంగ్ల భాషలో ఆంగ్ల భాష పరిజ్ఞానం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.  సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఈ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన చాంబర్ కు పిలిపించుకుని వారితో ముచ్చటించి అభినందించారు. బెండపూడి లో అవలంబిస్తున్న ఆంగ్ల విద్యా విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు సత్వర చర్యలు కూడా చేపట్టారు.  బెండపూడి విద్యార్థుల ప్రతిభ పై జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రసారం కావడంతో  అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు కోరారు. ఈ కారణంగా ఏర్పాట్లు చేశారు. 


అమెరికన్లతో మాట్లాడి యాక్సెంట్  మెరుగుపర్చుకున్న బెండపూడి విద్యార్థులు


బెండపూడి విద్యార్థులకు.. అమెరికన్ యాక్సెంట్ వచ్చేలా చేయడంలో అమెరికన్ల కృషి కూడా ఉంది. వారికి విద్యాబుద్దులు నేర్పిన ప్రసాద్ మాస్టారు.. తమకు పరిచయం ఉన్న ప్రవాసాంధ్రుల సాయంతో .. అక్కడి అమెరికన్లతో ఇక్కడి స్టూడెంట్లు మాట్లాడేలా చేశారు. ఇలా అమెరికన్లు.. బెండపూడి విద్యార్థులతో ప్రతీ రోజూ మాట్లాడటంతో వారికి యాక్సెంట్‌పై పట్టు చిక్కింది. అందుకే అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఈ విద్యార్థులతో ముచ్చటించేందుకు మరింత ఆసక్తి చూపించారు. 


బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?