Attack on TDP central office case | అమరావతి: వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu) నివాసంపై దాడి  కేసులను సీఐడీ (AP CID) దర్యాప్తు చేపట్టనుంది. ఈ మేరకు ఈ కేసుల దర్యాప్తును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ మంగళగిరి, తాడేపల్లి పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ కేసుల విచారణకు సంబంధించిన ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ సోమవారం నాడు అందజేయనున్నారు.


వైసీపీ హయాంలో జరిగిన దాడులు, పలువురి అరెస్ట్


వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 2021 అక్టోబర్‌ 19న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి చేశారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డిల  అనుచరులు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతోపాటు అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసంపై సైతం దాడి జరిగింది. మాజీ మంత్రి జోగి రమేశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తదితరులు, వారి అనుచరులతో వెళ్లి చంద్రబాబు ఇంటిపై దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ ఎంసీ నందిగం సురేశ్‌ సహా మరికొందర్ని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ రెండు కేసులు వేగంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు సీఐడీకి అప్పటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకూ జరిగిన విచారణ ఫైళ్లను సోమవారం నాడు సీఐడీకి పోలీసులు అప్పగించనున్నారు.


ఇప్పటికే కూటమిలో చేరిన పలువురు నేతలు


గుంటూరు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. వైస్సార్సీపీ పార్టీ ఆదేశాలు పాటించామని మాజీ ఎంపీ నందిగామ సురేష్ సహా పలువురు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులలో వైసీపీ నేతలు జోగి రమేష్, నందిగాం సురేష్, లేళ్ళ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసీల రఘురామ్, విజయవాడ, గుంటూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు నిందితులుగా ఉన్నాయి. ఇప్పటికే పలువురు వైస్సార్సీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరారు. ఓవరాల్ గా రెండు దాడి కేసుల్లో సుమారుగా వెయ్యి మంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 


Also Read: Pawan Kalyan: ఈ నెల 14 నుంచి పల్లెపండుగ వారోత్సవాలు - డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ పాల్గొంటారంటే?