ఏపీలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లంతా సంక్రాంతికి తమ సొంత గ్రామాలుకు తిరిగి వచ్చి పండుగ నాలుగు రోజులూ కుంటుంబంతో ఆనందంగా గడుపుతారు. అయితే పండుగకు సొంత ఊళ్లకు వచ్చే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ఆర్టీసీ... దాంతో పాటే అదనంగా 50 శాతం ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఛార్జీల వడ్డనపై ప్రయాణికులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 


అదనపు ఛార్జీలపై ప్రయాణికుల ఆగ్రహం


కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ధరలు పెంచి మరింత భారం వేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నిత్యవసరాల ధరలు ఆకాశనంటున్నాయని ఇలాంటి సమయంలో అదనపు భారం మోపడం సరికాదంటున్నారు. వినోదాన్ని అందించే సినిమాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ధరలు తగ్గించిన ప్రభుత్వం.... టికెట్లపై అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఛార్జీలు పెంపుపై మరొకసారి ఆలోచించాలని కోరుతున్నారు. 


Also Read:  త్వరలో ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ... అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం !


బస్సులకు విమాన ఛార్జీలు వసూలు చేస్తున్నారు : సీపీఐ నేత రామకృష్ణ


సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ అదనంగా ఛార్జీలు వసూలు చేయడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... సినిమా టికెట్ల విషయంలో పంతానికి పోయి రేట్లు తగ్గించిన ప్రభుత్వం, ఆర్టీసీ బస్సులకు ఎందుకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని, ఏపీలోనే ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ బస్సులు కూడా  అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, పండుగ పేరు చెప్పి ప్రయాణికుడిని దోచుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ. 3 వేలు, హైదరాబాద్ నుంచి విశాఖకు రూ. 5 వేలు వసూలు చేస్తున్నారన్నారు. అవి బస్సు ఛార్జీలా లేక విమాన ఛార్జీలా అర్థం కావడంలేదన్నారు. ప్రైవేట్ బస్సులు ఛార్జీలు పెంచకుండా అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ఛార్జీలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు.

 


Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


వైసీపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి : విష్ణువర్ధన్ రెడ్డి


వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సమయంలో పేదలపై భారం మోపడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ... రెండు నాలుకల ధోరణిలో వ్యవహరిస్తుందన్నారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు 50 శాతం పెంచడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు చాలా తేడా ఉందన్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదన్న ఆయన ఏపీలో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి పేదల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 



Also Read: వాళ్లు కొత్త బిచ్చగాళ్లు.. వన్ టైం ఛాన్సే ఇదీ, జనం తరిమి కొడతారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి