ఉద్యోగ సంఘ నేతలపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పీఆర్సీ సాధన సమితి నేతల తీరు వల్ల సమస్య జఠిలం అవుతోందన్నారు. ఉద్యోగులు బలప్రదర్శన చేద్దామని చూడటం సరికాదన్నారు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. బయటి శక్తుల ప్రమేయంతో ఉద్యోగులకు ఇబ్బందులొస్తాయని హెచ్చరించారు. 


ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలి.. ఏపీ ఉద్యోగ నేతల డిమాండ్ !


ఉద్యోగుల ఉద్యమంలో సంబంధం లేని ఇష్యూలు హైలెట్‌ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉద్యోగులు నియంత్రణ కోల్పోయి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధం. ఆందోళనలు, సమ్మెల వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ సమస్యలను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.  సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతీ రోజూ చర్చలకు రావాలని తాము పిలుపుస్తున్నామని కానీ ఉద్యోగసంఘం నేతలు రావడం లేదని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం బహిరంగచర్చకు రావాలని పిలుపునిస్తున్నారు.  


తగ్గని ప్రభుత్వం - పట్టు వీడని ఉద్యోగులు ! సమ్మె ఖాయం.. తర్వాత ఏంటి ?


మరో వైపు ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు సై అంటున్నారు. శని, ఆదివారాలు నిరసనలు తెలపాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. సమ్మె సహా భవిష్యత్ పోరాట కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలని సంఘ నేతలు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపుతామని.. టీ, భోజన విరామంలో డిపోల్లో భారీగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. విలీనం అనంతరం ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటోన్న సమస్యలను ధర్నాల్లో చర్చించాలని నిర్ణయించారు. హాజరైన సిబ్బందికి సమ్మె చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తారు. 


ఏపీ ఉద్యోగుల పెన్‌డౌన్ స్టార్ట్.. చర్చలకు రావాలని మళ్లీ ప్రభుత్వం పిలుపు !


ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయలేదు. ఉద్యోగుల్ని మాత్రమే విలీనం చేశారు. అయితే ఇప్పటికీ తాము ప్రభుత్వ ఉద్యోగులమా లేకపోతే ఆర్టీసీ ఉద్యోగులమా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయిందని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులని చెబుతూ ఆర్టీసీ నుంచి రావాల్సిన ప్రయోజనాలు ఆపేశారని.. ఆర్టీసీ ఉద్యోగులని చెబుతూ పీఆర్సీ అందకుండా చేశారని అంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతూండటంతో సోమవారం నుంచి బస్సులు కూడా నిలిచిపోనున్నాయి.