ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులోవిచారణ ముగిసింది. సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అటు ప్రభుత్వం, ఇటు రైతుల వాదలను హైకోర్టు విన్నది. పిటిషన్లపై విచారణ కొనసాగించాలని రైతుల తరపు న్యాయవాదులు కోరారు. అయితే మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నందున హైకోర్టులో దాఖలైన పిటిషన్లకు కాలం చెల్లిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం కొత్త చట్టం చేయకుండా ఆపే హక్కు కోర్టుకు లేదన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులు తేవాలని అసెంబ్లీలో చట్టం ఆమోదించింది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని అమరావతికి భూములిచ్చిన రైతులు కోర్టుకెళ్లారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న విచారణ గత నవంబర్‌లో ప్రారంభమంది. అయితే విచారణ కీలక దశలో ఉండగానే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగానే నవంబర్‌లోనే ఉపసంహరణ బిల్లులు పెట్టి ఆమోదించేశారు. దీంతో మూడు రాజధానుల చట్టాలు రద్దయ్యాయి.


తాము మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నాం కాబట్టి రైతుల పిటిషన్లను కొట్టి వేయాలని ప్రభుత్వం హైకోర్టులో కోరింది. అయితే రైతులు మాత్రం  మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెలుస్తామని ప్రభుత్వం చెబుతోందని.. విచారణ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. స్వయంగా ప్రభుత్వం కూడా మళ్లీ మూడు రాజధానుల బిల్లులు తెల్సాతమని హైకోర్టులో అఫిడవిట్ వేసింది. మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ..  మళ్లీ బిల్లులు తెస్తామని చెబుతున్నందున విచారణ కొనసాగించాల్సిందేనని రైతుల తరపు లాయర్లు హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు.  


హైకోర్టు రైతుల పిటిషన్లను కొట్టి వేస్తే కొత్తగా చట్టం తీసుకు రావాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే మూడు రాజధానులు అనే చట్టాన్ని కొట్టి వేస్తారని తెలిసే ప్రభుత్వం మరోసారి చట్టం తేవడానికి  ఉపసంహరించుకుందని అందుకే విచారణ కొనసాగించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైతే రాజధాని వివాదం సద్దుమణిగింది.ఏపీ రాజదాని అమరావతేనని కేంద్రం కూడా చెప్పింది.  హైకోర్టు తీర్పును బట్టి తదుపరి పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఒక వేళ విచారణ కొనసాగిస్తే ప్రభుత్వానికి మరో చట్టం చేసే అవకాశం ఉండదు. రైతుల పిటిషన్లు కొట్టి వేస్తే మరోసారి మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. అందుకే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.