కొత్త పీఆర్సీపై మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు విఫలయ్యాయని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు చేపట్టిన చలో విజయవాడను విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ విషయానికి ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలన్నారు. సమ్మె, ఆందోళన తాత్కాలికమని తిరిగి అందరూ కలిసే పని చేయాలన్న విషయాన్ని కలెక్టర్లు గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి గతంలో ఏంచెప్పారో ఇప్పుడూ అదే చేసిందన్నారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నామని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. మంత్రుల కమిటీ భేటీలో కూడా పాత అంశాలపైనే మాట్లాడారన్నారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన 3 అంశాలపై తేల్చాలని స్పష్టం చేశామని బండి శ్రీనివాస్ అన్నారు. ఆ అంశాలు సాధ్యపడవని మంత్రులు సూత్రప్రాయంగా తేల్చేశారని బండి శ్రీనివాస్‌ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక ఆహ్వానం వచ్చాకే చర్చలకు వెళ్లామని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ  జీవోల వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందని, వాటిని రద్దు చేయాలని కోరామన్నారు. ఈ నెల పాతజీతాలు ఇవ్వాలని కోరామన్నారు. 


ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ సిద్ధం 


పీఆర్సీ సాధన సమితి పిలుపుతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధంగా ఉన్నారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. రివర్స్ పీఆర్సీతో ఉద్యోగుల కన్నా ఆర్టీసీ ఉద్యోగులకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధన సమితి పిలుపతో ఈ నెల 5,6 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ల కమిటీ సభ్యులు ద్వారకా తిరుమలరావును కలిసి మెమోరాండం అందజేశారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా భాగస్వాములు అవుతామని తెలిపారు. 


ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు సీఎం జగన్ కు ఉద్యోగులంతా రుణపడి ఉంటామని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన నూతన పిఆర్సి వల్ల సాధారణ ఉద్యోగుల కన్నా ఆర్టీసీ ఉద్యోగులకు ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 5, 6 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 129 డిపోలు 4 వర్క్  షాపుల వద్ద ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే రెండు పీఆర్సీ నష్టపోయారని విలీనం అనంతరం పెన్షన్ వస్తుందనే ఆశతో ఉన్న ఉద్యోగులకు నూతన పీఆర్సీ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ, సీసీఏ తగ్గిపోవడంతో ఉద్యోగులంతా తీవ్ర నిరాశ ఉన్నారని మూడో తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొంటారన్నారు. 


ఉద్యమాన్ని హైజాక్ చేస్తారు : సీఎస్ సమీర్ శర్మ


ఉద్యోగులు సమ్మె  విరమించుకోవాలని ఏపీ సీఎస్ సమీర్ శర్మ అన్నారు. శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో  సమ్మె  మంచిది కాదన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. అందరికీ జీతాలు  పెరుగుతున్నాయని ఆయన అన్నారు. కొంతమంది  ఉద్యోగుల  ఉద్యమాన్ని  హైజాక్  చేస్తున్నారని ఆరోపించారు.  ఇవాళ రాత్రి 11 గంటల కల్లా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించేస్తామని సీఎస్ ప్రకటించారు. పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగులకు అభ్యంతరాలు ఉంటే వాటిని చర్చలతో పరిష్కరించుకోవాలన్నారు. చలో విజయవాడతో పాటు సమ్మెను విరమించుకోవాలని సూచించారు. సమ్మెకు వెళ్లడం సొంతంగా కష్టాలు కొని తెచ్చుకోవడమే అని హెచ్చరించారు. ప్రభుత్వం చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఉద్యోగులు సమ్మె చేస్తే అసాంఘిక శక్తులు దాన్ని కైవసం చేసేందుకు అవకాశం ఉందన్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. 


Also Read: కేంద్ర బడ్జెట్‌పై ఫన్నీ మీమ్స్.. అయ్యో, క్రిప్టోపై కన్నేశారే!!