AP IAS Officers : ఏపీ హైకోర్టు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు జైలుశిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్‌, అరుణ్‌కు నెలపాటు జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. అయితే అధికారులు విజ్ఞప్తితో శిక్ష అమలును కోర్టు ఆరు వారాలపాటు నిలిపివేసింది. కర్నూలు జిల్లా వ్యవసాయ సహాయకుడి విషయంలో కోర్టు తీర్పు అమలు చేయలేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు తీర్పు అమల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఐఏఎస్ అధికారలుకు జైలు శిక్ష విధించింది. 


గతంలో 8 మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష


ఇటీవల ఏపీ హైకోర్టు ధిక్కరణ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణపై ఐఏఎస్ లు క్షమాపణలు కోరారు. క్షమాపణలు కోరడంతో జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు హాస్టళ్లల్లో సేవా కార్యక్రమం చేపట్టాలని తీర్పు ఇచ్చింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వైఖరిని కోర్టు ధిక్కరణగా భావించి ఇవాళ తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మీ, గిరిజా శంకర్, వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎంఎం నాయక్ లు కోర్టు ధిక్కరణ ఎదుర్కొన్నారు. అయితే తర్వాత వారు సేవా శిక్షను అనుభవించకుండా మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మొదట ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్ వేయడంతో  కోర్టు తిరస్కరించింది. తర్వాత ఇద్దరు ఐఎఎస్‌లకు డివిజన్ బెంచ్ రిలీఫ్ ఇచ్చింది. దీంతో మిగిలిన ఆరుగురు కూడా సేవా శిక్షను తప్పించుకునేందుకు రిలీఫ్ కోసం డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించి ఊరట పొందారు. 


ఐఏఎస్ లకు ఊరట 


ఐఏఎస్ అధికారులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో సామాజిక సేవా శిక్షకు హైకోర్టు ఊరట ఇచ్చిది. ఐఏఎస్‌లకు విధించిన సేవా శిక్షను 8 వారాల పాటు  హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కోర్టు ధిక్కరణ కింద 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు సింగిల్‌ జడ్జి సేవాశిక్ష వేసింది. ఈ శిక్షను డివిజనల్‌ బెంచ్‌లో ఇద్దరు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. సేవాశిక్షను 8 వారాలపాటు  చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. సేవాశిక్షను ధర్మాసనంలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు సవాల్‌ చేశారు. జస్టిస్‌ అసదుద్దిన్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆరుగురు ఐఏఎస్‌ల సేవాశిక్షను 8 వారాలు సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు కోర్టు వాయిదా వేసింది.