AP High Court :  తెలుగుదేశం పార్టీ ఆఫీసు, చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలకు మరోసారి  హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఉదయం ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. ఆ సమయంలో తమకు రెండు వారాల పాటు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్తామని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపైనా విచారణ జరిపిన హైకోర్టు రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.  టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ , నందిగం సురేష్ , అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు.  చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. 


అన్ని న్యాయపరమైన అవకాశాల్ని కోల్పోయిన వైసీపీ నేతలు                       


న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో వారందర్నీ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు విచారణకు పిలిచినా జోగి రమేష్ హాజరు కాలేదు. వచ్చినా విచారణకు సహకరించడం లేదు. ఈ కారణం చేత కూడా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నిందితుడు అయిన దేవినేని అవినాష్ కొద్ది రోజుల కిందట సైలెంట్ గా కుటుంబంతో సహా దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించారు. లుకౌట్ నోటీసులు ఉండటంతో ప్రయాణానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన వెనక్కి రావాల్సి వచ్చింది. 


దాన కర్ణుడు పవన్ కల్యాణ్ - వ్యక్తిగత ఆదాయం నుంచి రూ.6 కోట్లు విరాళం !


ఇక నుంచి అరెస్టులు - పరారీలో నేతలు            


ముందస్తు బెయిల్ పిటిషన్లు కోర్టుల్లో ఉండటంతో .. అరెస్టు విషయంలో పోలీసులు తొందరపడలేదు. ఇప్పుడు పిటిషన్లు పరిష్కారం కావడంతో విచారణకు సహకరించని వారిని ముందుగా అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్తే ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండా పోయారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నందిగం సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మిగిలిన వారిని కూడా అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. 


చిరంజీవి 'మెగా' విరాళం... ఏపీ, తెలంగాణలో సహాయక చర్యలకు ఎంత ఇచ్చారంటే?


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు - ఇప్పుడు కష్టాలు          


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి మరీ దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు పైపై కేసులు పెట్టి వదిలేశారు. సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నా.. నిందితుల్ని ఎవర్నీ అరెస్టు చేయలేదు. కానీ ప్రభుత్వం మారిపోయాక.. ఈ కేసు విషయంలో సీసీ టీవీ ఫుటేజీ , కాల్ డేటా  ఆధారంగా.. నిందితుల్ని కుట్ర దారుల్ని గుర్తించి కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి ఈకేసుల్లో కీలకంగా ఉన్నారని తెలియడంతో వారిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.