ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పేదలందరీ ఇళ్ల పథకంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం కేటాయించిన సెంటు, సెంటున్నర భూమిలో ఇళ్ల నిర్మాణం ఎలా సరిపోతుందని కోర్టు ప్రశ్నించింది. ఇళ్ల స్థలాలపై కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించింది. కమిటీ నివేదిక ఇచ్చేవరకూ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. కన్వేయన్స్‌ డీడ్‌ బదులుగా డీ-ఫాం పట్టాలివ్వాలని కోర్టు సూచించింది. మహిళలకు మాత్రమే కాకుండా పురుషులు, ట్రాన్స్‌ జెండర్లకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై శుక్రవారం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను హైకోర్టు నిరాకరించింది.


అసలేం జరిగింది


నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో 128 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు 108 పేజీల తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వ పాలనా నిర్ణయాలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులు తప్పక జోక్యం చేసుకుంటాయని ప్రకటించింది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 3 జీవోల్లోని పలు నిబంధనలను కొట్టివేసింది.


Also Read: ఏపీలో రూ. 10, 20వేలకే ఇళ్లు ! వాలంటీర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు ..


అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణాలు వద్దు


ప్రభుత్వ కేటాయించిన సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హైకోర్టు తెలిపింది. అంతే కాక అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు సంబంధించే ప్రమాదముందని పేర్కొంది. ఈ విషయాలను పరిశీలించకుండా ఇళ్లు కట్టుకోవాలని బలవంతం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. పేదలకు ఇళ్ల కేటాయింపునకు వ్యతిరేకం కాదని ధర్మాసనం పేర్కొంది. మహిళలకే కాకుండా విడాకులు తీసుకున్న పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్ల కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ, గృహనిర్మాణం, పర్యావరణ శాఖలోని నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీ నివేదిక నెలరోజుల్లో ఇవ్వాలని సూచించింది. ఈ నివేదికపై ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి అప్పుడు గృహనిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.  


Also Read: పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక తీర్పు... నిర్మాణాలు ఆపాలని కీలక ఆదేశాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి