AP Village Ward Secretariat : ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సీఎం జగన్ అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సచివాలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని, బదిలీలకు అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌ను కోరాయి. బదిలీలకు సీఎం అంగీకరించినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి మీడియాతో అన్నారు. బదిలీలపై త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని సీఎం చెప్పినట్టు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 


సీఎంకు కృతజ్ఞతలు 


25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ.నారాయణరెడ్డితో పాటు వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటి నుంచే పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 


కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులు 


అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు 8 సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన తర్వాత బదిలీ చేశారని, దానిని 5 సంవత్సరాలకు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోందన్నారు. అలా కాకుండా 8 సంవత్సరాలు ఒకే చోట పనిచేసేలా ఉండాలని సీఎంను కోరమని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండు దశాబ్దాలుగాపైగా ఎంపీడీవోల ఎదురుచూపులను సీఎం జగన్‌ ప్రభుత్వం పరిష్కరించడంతో వారు ఆనందంలో ఉన్నారన్నారు.  కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులు సృష్టించి ఏప్రిల్ లో పదోన్నతులు ఇచ్చారని స్పష్టం చేశారు. 


ఎంపీడీవోలకు పదోన్నతులు 


జిల్లాల విభజన ప్రక్రియ వల్ల ఏప్రిల్ లో ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వలేకపోయారని, వారికి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ఇటీవలే సీఎం ఆదేశించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.  గురువారం అర్హత కల్గిన ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ వ్యక్తిగతంగా అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. పదోన్నతులు కల్పించినందుకు సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపామన్నారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. బదిలీల కోసం ఎప్పటి నుంచో సచివాలయ సిబ్బందికి ఎదురుచూస్తున్నారు.  






Also Read : Cag Letters To AP : లెక్కలు చెప్పండి ప్లీజ్ - ఏపీ సర్కార్‌కు కాగ్ వరుస లేఖలు !


Also Read : CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు