Radhe Shyam: రాధేశ్యామ్ కు ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. హీరో ప్రభాస్‌(Prabhas), హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన పాన్‌ ఇండియా మూవీ రాధేశ్యామ్‌ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.  ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం చిత్ర నిర్మాణ సంస్థకు టికెట్‌ ధర విషయంలో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా ప్రీమియం టికెట్‌ ధరపై రూ.25 అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. రాధేశ్యామ్ సినిమా బడ్జెట్‌ రూ.170 కోట్లు కాగా, జీఎస్టీ, ఇతర బిల్స్‌ను నిర్మాణ సంస్థ ఏపీ ప్రభుత్వానికి అందించింది. నటుల రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా సినిమా తీయడానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తే టికెట్‌ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తామని సీఎం జగన్‌ ఇటీవల ప్రకటించారు. 


రాధేశ్యామ్ కు డబుల్ సెన్సార్


'రాధే శ్యామ్' రన్ టైమ్ ఎంత? రెండు గంటల ఎనిమిది నిమిషాలు! అంటే... 138 నిమిషాలు. నిజం చెప్పాలంటే... సినిమా నిడివి రెండున్నర గంటలు! 150 నిమిషాల సినిమా 138 నిమిషాలకు రావడం వెనుక దర్శక ధీరుడు రాజమౌళి సలహాలు, సూచనలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ ఖబర్. గత ఏడాది డిసెంబర్ 21న 'రాధే శ్యామ్' సెన్సార్ కంప్లీట్ అయ్యింది. అప్పుడు సినిమా రన్ టైమ్ 150 నిమిషాలు. రీసెంట్‌గా మళ్ళీ సెన్సార్ చేయించారు. గతంలో సెన్సార్‌కు ఇచ్చిన సినిమాను, ఇప్పుడు సెన్సార్‌కు ఇచ్చిన సినిమాను గమనిస్తే... 23 నిమిషాలు డిలీట్ చేసి, కొత్తగా 11 నిమిషాలు యాడ్ చేశారట. దాంతో సినిమా మరింత క్రిస్పీగా అయ్యిందని, ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుందని యూనిట్ భావిస్తోంది. 'రాధే శ్యామ్'ను కొన్ని రోజుల క్రితం రాజమౌళి చూశారని, ఆయన ఇచ్చిన సలహాతో ట్రిమ్ చేశారనే టాక్ నడుస్తోంది. ప్రభాస్ సైతం రాజమౌళి సూచించిన మార్పులతో శాటిస్ ఫై అయ్యారట.


Also Read: ప్రభాస్ తో గొడవ, పూజాహెగ్డే రియాక్షన్ ఇదే


'రాధే శ్యామ్' సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ఆయన జోడీగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ 'రాధే శ్యామ్' సినిమాను నిర్మించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.