AP Government Suspended Three IPS Officers: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ముంబై నటి జెత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా (Kanti Rana), ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీపై (Vishal Gunni) సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేశారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు.


వైసీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జత్వానీని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అభియోగాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఓసారి విజయవాడ వచ్చి వెళ్లిన కాదంబరీ ఇటీవలే మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీ నేత విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకంగా ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు గుర్తించారు. దీనిపై నివేదికను డీజీపీకి సమర్పించారు. ఈ క్రమంలో ముగ్గురు ఐపీఎస్‌లపైనా తాజాగా వేటు పడింది.


నటి ఏం చెప్పారంటే.?


వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పోలీసులే తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ పోలీసులకు తెలిపారు. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ముంబైలో అరెస్ట్ చేశారన్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని అన్నారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని కోరారు. అంతకు ముందు సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో విడుదల చేశారు.


Also Read: YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్