AP New Liquor Policy :  ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం ప్రభుత్వం చేతుల్లో ఉంది. మద్యం దుకాణాలకు రెండేళ్లకు పర్మిషన్ ఇచ్చేవారు. ఆ కాలం పూర్తయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసింది. వేలంను నిలిపివేసింది. అయితే అదే సమయంలో బార్లు మాత్రం మూయించలేకపోయింది. వాటిని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోలేకపోయింది. ఇందు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ కోర్టుల్లో నిలబడలేదు. ఎందుకంటే బార్లకు ప్రభుత్వం ఐదేళ్లకు లైసెన్స్‌లు ఇస్తుంది. 2017లో చివరి సారిగా లైసెన్స్‌లు ఇచ్చారు. అవి ఈ ఏడాది ముగిసిపోతున్నాయి. ఇప్పుడు కొత్త  బార్ పాలసీని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. 


భారీగా లైసెన్స్ ఫీజులు పెంచాలని నిర్ణయం 


అయితే మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందనేది మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠగా మారింది. అయితే ఆర్థిక కష్టాల కారణంగా బార్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. ఆ సంఖ్యను యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ ఆదాయం కోసం  లైసెన్సు ఫీజులు మాత్రం భారీగా పెంచనున్నారని చెబుతున్నారు.  ప్రస్తుతం మూడు శ్లాబుల్లో.. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.  10 లక్షలు.. 50వేలు నుండి 3లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోరూ.   20 లక్షలు.. 3 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో  రూ. 30 లక్షలు.. ఫీజులు  ఉన్నాయి.


గతంలోనే కొత్త పాలసీ తెచ్చే ప్రయత్నం చేసి విఫలం 


వాటిని ఇప్పుడు వరుసగా  రూ. 20 లక్షలు,  రూ. 30 లక్షలు,  రూ. 50 లక్షలుగా పెంచేందుకు స‌న్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు.  కొత్త పాలసీకి నెల రోజులే సమయం ఉన్నందున వారం పది రోజుల్లో బార్‌ పాలసీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ రెడీ అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఎంపిక విధానం ఉంటాయి. అన్ని బార్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. వాస్తవానికి వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొత్త‌గా వ‌చ్చిన వారికి అవ‌కాశాలు ఇచ్చింది. టీడీపీ కి ద‌గ్గ‌ర‌గా ఉన్న వారంద‌రిని దూరం పెట్టి, 2019 నవంబరులోనే కొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. 


ఎంత కాలానికి పర్మిషన్ ఇస్తారు ?


కానీ తమకు 2022 వరకు గడువు ఉందంటూ బార్ల యాజమాన్యాలు, కోర్టు మెట్లెక్కారు.దీంతో ప్రభుత్వం చేసిన ప్రయత్నం ముందుకు సాగ‌లేదు.ఇప్పుడు పాలసీ గడువు పూర్తిగా ముగియ‌టంతో అన్ని అస్త్రాల‌ను సిద్దం చేసుకునేందుకు స‌ర్కార్ రెడీ అయ్యింది.ఎన్నిక‌ల హామీ ప్రకారం జగన్‌ ప్రభుత్వం మిగిలిన రెండేళ్లలో మద్యనిషేధం అమలు చేయాల్సి ఉంది. మ‌రి కొత్త గా వ‌చ్చే బార్ల‌కు ఎన్ని సంవ‌త్స‌రాలు అనుమ‌తులు ఇస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.