AP Volunteers Door Door Campaign in Visakha: విశాఖపట్నం: ఏపీలో వైసీపీ నేతలు, వాలంటీర్లు ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వైసీపీకి, వైఎస్ జగన్‌కు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ కనిపించారు. విశాఖపట్నం జిల్లాలోని గొలుగొండ మండలంలో వాలంటీర్లు వైఎస్ జగన్ పార్టీ తరఫున ప్రచారం చేయడంతో ఈసీ నిబంధనల ఉల్లంఘన జరిగింది.


రెండు రోజుల కిందట (మార్చి 16న) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనూ వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగం చేయవద్దని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (AP CEO) ముకేశ్‌కుమార్‌ మీనా సైతం వాలంటీర్ల పాత్రపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కనుక వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులలో టీచర్లకు మినహాయింపు ఉందని, ఎన్నికల విధుల్లో దాదాపు 60 శాతం వారే ఉంటారని చెప్పారు. అందుకే టీచర్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ అంత తేలిక కాదన్నారు. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే కేవలం ఓటర్ల వేలికి ఇంకు వేయడానికి పరిమితం చేస్తామని ఏపీ సీఈఓ స్పష్టం చేశారు.  


ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు! 
ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని హెచ్చరించినా, ఈసీ ఆదేశాలను ఏపీలో వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. పైగా ఇంటింటి ప్రచారానికి వెళ్లి వైఎస్ జగన్‌కు, వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. జగనన్నను గెలిపించుకోవాలని తాము ప్రచారం చేస్తున్నామంటూ ప్రచారానికి వెళ్లిన వాలంటీర్లు బహిరంగంగానే చెబుతున్నారు. వాలంటీర్ల మాటలు విని స్థానికులు కంగుతిన్నారు. ప్రభుత్వం అందించిన పథకాలు, చేస్తున్న సంక్షేమం గురించి ప్రచారం చేయవచ్చు కానీ, పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసే హక్కు మీకు లేదంటూ వాలంటీర్లను స్థానికులు నిలదీశారు. ఏ కుటుంబానికి ఎంత లబ్ది జరిగిందో చెప్పడంతో పాటు, ఫోన్‌ ద్వారా లబ్దిదారుల ఫొటోలు తీసి, సేవ్ చేస్తున్నారు. తమ ఫొటోలు ఎందుకు తీస్తున్నారని సైతం అక్కడి ప్రజలు వాలంటీర్లను ప్రశ్నించారు.  


వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను నిఘా వ్యవస్థలా వినియోగించుకుంటుందని, వారికి ప్రజల డేటా ఎందుకు ఇవ్వాలని గతంలో పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు ప్రశ్నించారు. వాలంటీర్లను ప్రభుత్వ సొమ్ముతో పోషించి, వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గతంలో ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లగా.. వాలంటీర్లు ప్రభుత్వ పనులు మాత్రమే చేయాలని, పార్టీలకు సంబంధించిన పనుల్లో వారు జోక్యం చేసుకోకుండా చూడాలని సైతం కోర్టు ఆదేశించింది. వాలంటీర్లకు జీతాలు, వారి విధులు, ఏ అంశాల మేరకు వారిని నియమించారని సైతం గతంలో హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజాగా ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వాలంటీర్ల అంశం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన మధ్య మరోసారి వివాదంగా మారనుంది.