Andhra Pradesh Weather News: ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది రానున్న రెండుమూడు రోజుల్లో మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని అన్నారు.


దీని ప్రభావంతో ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.


శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వరద ప్రవహించే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు  చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.


గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో 137మిమీ, కొయ్యలగూడెంలో 111మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో  96మిమీ, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92మిమీ, నిడదవోలులో 91మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 78మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. 18 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు తెలిపారు.


Also Read: నేడు రెడ్ అలర్ట్! అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు - ఐఎండీ వార్నింగ్ 


Also Read: ఈ ఊళ్లో మహాత్మాగాంధీనే గ్రామ దేవత! గాంధీ ‘గాంధమ్మ’ అయ్యారు