జంతువులను సైతం సరిగ్గా ట్రీట్ చేయాలని.. మనిషికి ఏ స్థాయిలో వైద్యం అందిస్తున్నామో అదే విధంగా పశువులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం పని చేయాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్‌ ఉన్నట్లుగానే  పశు సంవర్థక శాఖలో కూడా అమలు కావాలన్నారు.


పశువులకు వ్యాక్సినేషన్‌ పై దృష్టి పెట్టాలన్న సీఎం జగన్ 
పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. పశువులకు వ్యాక్సినేషన్‌ పై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు. లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్, అందులో ఏఎన్‌ఎం, అండగా ఆశావర్కర్లు ఇలా ఒక వ్యవస్థ జనరేట్‌ అయ్యిందని, అదే తరహాలో  ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలని జగన్ అన్నారు.


యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్ సమర్ధతను పెంచాలన్న సీఎం, గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలని అధికారులకు సూచించారు. దీనికోసం ఎస్‌ఓపీ తయారుచేయాలన్నారు. ప్రతి మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంటుకు పూర్తిస్థాయి మద్దతు, సహకారం ఉండాలని తెలిపారు. దీని వల్ల సంతృప్త స్థాయిలో పశువులకు తగిన వైద్యం సహా పోషణ సేవలను అందించడానికి వీలవుతుందన్న జగన్ అభిప్రాయపడ్డారు. పశుపోషణ చేస్తున్న వారి వద్ద కాల్‌సెంటర్‌ నెంబరు మరియు యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.


పశువులకు హెల్త్ కార్డ్.... 
ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని జగన్ సూచించారు. దీని వల్ల పశువులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందని, పశుసంవర్థక శాఖలో ఏ స్కీం అమలు చేసినా అర్హులందరికీ అందే విధంగా ప్రణాళికను రూపొందించాలన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని,వివక్ష లేకుండా అందరికీ పథకాలను అందించాలన్నారు.


పాడి రైతులకు శిక్షణ... 
జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్‌ సొసైటీల వద్ద అమూల్‌ భాగస్వామ్యంతో పాడి రైతులకు శిక్షణ ఇప్పించాలని అధికారులకు జగన్ సూచించారు. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాంటి పరిస్థితులు రాకుండా పాల నాణ్యత పెరగాలన్నారు. రసాయనాలకు తావులేని పశుపోషణ విధానాలపై అవగాహన పెంచి,పశుసంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలని తెలిపారు.


చేయూత ద్వారా మహిళలకు జీవనోపాధి 
వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్బంగా సూచించారు. ఇప్పటికే రెండు సంవత్సరాల పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్క చెల్లెమ్మలకు  ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చామని జగన్ అన్నారు. ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడానికి, ఆ మార్గాలను బలోపేతంచేయడానికి ఉపయోగ పడుతుందని వివరించారు. పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాల కోసం అవసరమైన రుణాలు మంజూరు చేయించడంలో కూడా అధికారులు దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. జగనన్న పాలవెల్లువను సమీక్షించిన సీఎం, అధికారులు పాల ఉత్పత్తికి తీసుకుంటున్న చర్యలపై నివేదకను సమర్పించారు.