రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, యూనివర్శిటీలను మాదక రహితంగా తయారుచేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అన్నికాలేజీలు, యూనివర్శిటీలపై పర్యవేక్షణ  ఉండాలన్నారు. మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా? లేవా? అనే విషయంపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఒకవేళ మాదక ద్రవ్యాల ఉదంతాలు ఉంటే అలాంటి కాలేజీలను మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అన్నారు. కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదని ఆదేశించారు. డ్రగ్స్ వ్యవహారాలను ఒక సవాల్‌గా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి ప్రగతి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు మాదక రహితంగా ఉండాలన్నారు. 




డ్రగ్స్ వ్యవహారంపై అసత్య ప్రచారాలు


ఏపీకి సంబంధంలేని డ్రగ్స్ వ్యవహారంపై రూమర్స్ ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. లేని అంశాన్ని... ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతోపాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసి కూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 


అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఉక్కుపాదం


మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీచేశారు. అక్రమంగా మద్యం తయారీ, రవాణాలపై ఎస్‌ఈబీ సహా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే మద్యపానం నిషేధానికి చర్యలు చేపట్టామన్నారు. 43 వేల బెల్టుషాపులు తీసేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించామన్నారు. మద్యం అమ్మకాల వేళలు తగ్గించామని తెలిపారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. మద్యం రేట్లు పెంచి వినియోగం గణనీయంగా తగ్గించామన్నారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వకూడదన్నారు. ఇసుక అక్రమ రవాణాపైన కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం.. అవసరమైతే చట్టం తీసుకురావాలని సూచించారు. 






Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?


నేరానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలమ్యాపింగ్ 


దిశ చట్టం అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం తదితర అంశాలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. ప్రతి మహిళ సెల్‌ఫోన్ లో ‘దిశ’ యాప్‌ ఉండాలని సూచించారు. ఇప్పటివరకూ 74,13,562 మంది ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని పోలీసు అధికారులు సీఎంకు తెలిపారు. దిశ యాప్‌ ద్వారా 5238 మందికి సహాయం అందించామన్నారు. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్‌ చేశామని అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి పరిష్కారం ఎంతవరకూ వచ్చిందో మేసేజ్‌ల ద్వారా వివరిస్తున్నామని పోలీసులు తెలిపారు.  దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ వచ్చిందని పేర్కొన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామని పోలీసులు సీఎంకు తెలిపారు. ఫోరెన్సిక్‌ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందని తెలిపారు. 


Also Read: అభ్యర్థిని ప్రకటించి మరీ వెనక్కి తగ్గిన టీడీపీ ! సంప్రదాయమా ? పలాయనమా ?


కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయండి


దిశ యాప్ చాలా సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం జగన్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్‌ డౌన్లోడ్‌ కావాలన్నారు. వాలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలని సీఎం సూచించారు. ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. దిశ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్షించారు. ‘దిశ’బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో వివరాలు అడిగితెలుసుకున్నారు. శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదన్నారు. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సమీక్షించిన సీఎం జగన్... పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయన్నారు. డిసెంబర్‌ నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయలన్న సీఎం.. దీనికోసం సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్నారు. 


Also Read: త్వరలో గ్రూప్‌-1 ఫలితాలు.. వారంలో ఆ పోస్టులకు నోటిఫికేషన్


దిశ ఒన్ స్టాప్ సెంటర్ల పనితీరుపై ఆరా


‘దిశ’ ఒన్‌స్టాప్‌ సెంటర్ల పనితీరుపైనా సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకూ 2652 కేసులను దిశ ఒన్‌స్టాప్‌ సెంటర్ల ద్వారా పరిష్కరించామని అధికారులు తెలిపారు. దేవాలయాల్లో భద్రతకోసం 51,053 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాకుండా, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. శరవేంగా బాధితులను ఆదుకోవాలన్నారు. వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలని సూచించారు. ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయాలన్నారు. ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే తన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశించారు. సమర్థత ఉన్న అధికారులు, న్యాయవాదులను ఇందులో నియమించాలన్నారు. 


ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,  వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


Also Read: ఎయిడెడ్ స్కూళ్లకు ఎయిడ్ ఆపొద్దు.. ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి