Pawan Kalyan attends Anant Ambani Shubh Aashirwad ceremony |  ముంబై: ముంబై: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అంబానీ ఫ్యామిలీ నుంచి వివాహ వేడుకలకు ఆహ్వానం అందడంతో శనివారం (జులై 13) నాడు ముంబైకి వెళ్లారు. జియో వరల్డ్ సెంటర్‌లో నేడు జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తన సతీమణి ఉపాసనతో కలిసి గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అంబానీల ఈవెంట్లోనూ బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించారు. రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీల వేడుకకు హాజరయ్యారు. 




అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలంటే మాటలా. దేశ, విదేశాల నుంచి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, హాలీవుడ్ సెలబ్రిటీలు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మూడు రోజుల పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారు. జులై 12న అనంత్, రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం నాడు అనంత్, రాధికలకు ఆశీర్వాదం అందించే శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వేడుకల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ లను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. టీడీపీ అధినేత వారిని భుజంతట్టి, కొంతసేపు మాట్లాడారు. 






చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అంబానీ స్వాగతం
ఏపీ సీఎం చంద్రబాబు అనంత్ అంబానీ - రాధికా మర్చంచ్‌ల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లే షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అటు నుంచి నేరుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌ను ఆప్యాయంగా పలకరించి కాసేపు వారితో ముచ్చటించారు. 


ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాత్రికి నారిమన్ పాయింట్ లోని ఓబెరాయ్ హోటల్లో చంద్రబాబు దంపతులు బస చేయనున్నారు. ఆదివారం (జులై 14న) ఉదయం ముంబైలోని మఖేష్ అంబానీ నివాసం ఆంటీలియాలో ఫంక్షన్ కు హాజరవుతారు. ఈ వేడుకల అనంతరం ముంబై నుంచి విజయవాడకు ఏపీ సీఎం చంద్రబాబు తిరుగు పయనమవుతారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు.