AP Latest News:  సూక్ష్మ,చిన్న మరియు మధ్యతరహా  (ఎంఎస్ఎఇ) యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా చదువుకున్న నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు.


ఉపాధి అవకాశాలపై సీఎస్ సమీక్ష... 
ఎంఎస్ఎంఇ రంగంపై అధికారులతో  జవహర్ రెడ్డి సమీక్షించారు. 2022-23 ఆర్దిక సంవత్సరంలో 15వేల 625 కోట్ల ఖర్చుతో లక్షా 25వేల  యూనిట్లు నెలకొల్పి లక్షా 56 వేల మందికి పైగా ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నాని అన్నారు. అయితే ఇప్పటి వరకూ 9వేల 677 కోట్ల ఖర్చుతో,  62 శాతం లక్ష్య సాధనతో 92 వేల 707 యూనిట్లను 75శాతం లక్ష్య సాధనతో 3 లక్షల 61 వేల మందికి ఉపాధి కల్పించి ఉపాధి కల్పనలో 231 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.


తరువాత టార్గెట్ ఇది...
2023- 2024 ఏడాదిలో మరో లక్షా 50 వేల యూనిట్లు నెలకొల్పి 7లక్షల 50వేల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు  సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఇ యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన భూముల గుర్తింపు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకునేలా తరచు కలెక్టర్లతో మాట్లాడాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ను  సిఎస్ ఆదేశించారు. ఎంఎస్ఎంఇ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్న వివిధ యూనిట్లను వచ్చే అక్టోబరు 2వ తేదీన ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారులను జవహర్ రెడ్డి ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఇ యూనిట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


జిల్లాకు ఒక ప్రాడక్ట్...
ఒక జిల్లా ఒక ప్రాడక్ట్.. అనే విధానం ద్వారా ప్రతి జిల్లా నుండి కనీసం రెండు మూడు ఉత్పత్తులను గుర్తించి ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని పరిశ్రమల శాఖ, చేనేత జౌళి శాఖ అధికారులను జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించి పలు అంశాలను ఈసమావేశంలో సీఎస్ ఆయా అధికారులతో సమీక్షించారు.


ఎంఎస్ఎంఇ రంగంలో పురోగతి...
రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కె. ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఇ రంగంలో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 69వేల 338 కోట్ల వ్యయంతో 3లక్షల 94వేల వివిధ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పనట్లు చెప్పారు.  34 లక్షల 84 వేల మందికి  ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ఎంఎస్ఇ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద వివిధ యూనిట్లు ఏర్పాటుకు 46 ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు అందాయని వివరించారు.
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ కార్యక్రమం కింద 2022-23లో 6750  యూనిట్లు నెలకొల్పాల్సి ఉండగా,  3069 యూనిట్లు నెలకొల్పి 25 వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి లో భాగంగా ప్రాధమికంగా విశాఖ, కాకినాడ, గుంటూరు మూడు జిల్లాల నుండి కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు కమిషనర్ ప్రవీణ్ కుమార్ వివరించారు.