AP Cabinet: ఉద్యోగులకు సంబందించిన 5 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి తెలిపారు. డీఏ జీవోలను కూడా ప్రభుత్వం ఆమోదించిందని.. జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్ మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేశారని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. కొత్త పీఆర్సీ కమిషన్ వేసేందుకు కేబినెట్ నిర్ణయంపై కృతజ్ఞతలు చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. పీఆర్సీ, ఉద్యోగి కాంట్రిబ్యూషన్ మినహా పాత పెన్షన్ విధానంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ వచ్చేలా నిర్ణయం తీసుకోవడం నిజంగా హర్షణీయమన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే మరిన్ని ప్రయోజనాలు ఇచ్చేలా సీఎం ముందుకెళ్తారని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వివరించారు.


రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధాం తీసుకొస్తోంది. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఉదయం 11 గంటలకు సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశంలో మరికొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ బటన్‌ నొక్కి తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలని డిసైడ్ చేశారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగించేందుకు కూడా ఓకే చెప్పారు. దీని కోసం రూ. 6,888 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన బిల్లుకు ఓకే చెప్పింది కేబినెట్. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాలు తీసుకు వచ్చేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


కొత్త మెడికల్ కాలేజీల కోసం 706 పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ అంగీకరించింది. ఏపీ పౌరసరఫరాల సంస్థకు రూ.5000 కోట్ల రుణం తీసుకునేందుకు ఓకే చెప్పింది. జూన్ 12 నుంచి 17 వరకు జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వహించాలని తీర్మానించారు.  ఇటీవల పదో తరగతి పరీక్షల్లో పాసైన వారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిచిన వారికి జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేయనున్నారు.