WTC Final 2023: 


ఆస్ట్రేలియా డేంజరస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై విరాట్‌ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. అతడిని త్వరగా ఔట్‌ చేయకపోతే ఆటను ఈజీగా తమ నుంచి లాగేస్తాడని పేర్కొన్నాడు. ఆసీస్‌ జట్టులో అతడే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అని వెల్లడించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్‌ ఫైనల్‌కు ముందు కింగ్‌ కోహ్లీ ఐసీసీతో మాట్లాడాడు.


'ఆస్ట్రేలియాలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఎవరని మేం విరాట్‌ కోహ్లీని అడిగాం. వార్నర్ ఫామ్‌లో ఉంటే అతడినెవరూ ఆపలేరని అన్నాడు. ఎందుకంటే అతడు ఎక్కువ పొరపాట్లు చేయడు' అని ఐసీసీ ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్‌ చేసింది.


'ఇంపాక్ట్‌ ప్లేయర్‌! అంటే డేవిడ్‌ వార్నర్‌ అనే చెప్తాను. చాలా వేగంగా అతడు మ్యాచ్‌ను ప్రత్యర్థి నుంచి లాగేస్తాడు. అతడిని సాధ్యమైన త్వరగా ఔట్‌ చేయాలలి. లేదంటే అతడు వేగంగా, కచ్చితంగా మనల్ని గాయపరుస్తాడు. వెంటవెంటనే బౌండరీలు బాదేస్తాడు. ఎక్కువ పొరపాట్లు చేయడు' అని విరాట్‌ కోహ్లీ అన్నాడు.


'ఆస్ట్రేలియాకు అన్ని ఫార్మాట్లలో డేవిడ్‌ వార్నర్‌ ఇంపాక్ట్‌ఫుల్‌ ఇన్నింగ్సులు ఆడతాడు. టెస్టు క్రికెట్లో ఆసీస్‌ తరఫున అతడికి అద్భుతమైన ఇన్నింగ్సులు ఉన్నాయి. ఏదేమైనా అతడు డేంజరస్‌ ప్లేయర్‌. ఫైనల్లో మేం త్వరగా ఔట్‌ చేయాల్సి ఉంటుంది' అని విరాట్‌ వీడియోలో చెప్పాడు.




టీమ్‌ఇండియా ఐసీసీ టైటిల్‌ గెలిచి పదేళ్లు అవుతోంది. చివరి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో కొద్దిలో 'గద'ను మిస్ చేసుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసి కనిపిస్తోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ క్లాస్‌ టచ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ అతడిలో ఉత్సాహం నింపింది. రోహిత్‌ శర్మ మరోసారి తన కెప్టెన్సీ బుర్రకు పదును పెట్టాల్సి ఉంది. చెతేశ్వర్‌ పుజారా కౌంటీ క్రికెట్‌ ఆడుతూ ఇంగ్లాండ్‌ పిచ్‌లు, వాతావరణాన్ని ఔపోశన పట్టాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో విజృంభించిన విరాట్‌ కోహ్లీకి ఓవల్‌లో సూపర్‌ రికార్డు ఉంది. అజింక్య రహానె, రవీంద్ర జడేజా తమ స్థాయి ఇన్నింగ్సులు ఆడితే మంచిది. కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌ మధ్య పోటీ నెలకొంది. ప్రాక్టీస్‌ను బట్టి కిషన్‌ తుది జట్టులోకి వస్తాడని సమాచారం. పైగా ఎక్స్‌ఫ్యాక్టర్‌గా ఉండగలడు. మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌ ద్వయం జోష్‌లో ఉంది. వీరిద్దరూ దూకుడుగా బౌలింగ్‌ చేస్తే తిరుగుండదు. వీరికి తోడుగా ఉమేశ్‌ ఉంటాడు. పిచ్‌ను బట్టి నాలుగో పేసర్‌గా శార్దూల్‌ వస్తాడు. లేదంటే యాష్‌కు అవకాశం దొరుకుతుంది. రెండు రోజులుగా టీమ్‌ఇండియా స్లిప్‌ క్యాచింగ్‌ బాగా ప్రాక్టీస్‌ చేసింది.


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌


స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌