AP BJP On KCR :   తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఓపెన్ కోటా పదిహేను శాతాన్ని రద్దు చేస్తూ... కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వైద్య విద్యార్థులకు  నష్టం‌ కలిగేలా తెలంగాణ ప్రభుత్వం జిఓ నంబర్ 72 తీసుకువచ్చిందని..   విభజన చట్టం‌ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అందరికీ  విద్య, వైద్య అంశాలలో సమాన హక్కులున్నాయన్నారు.  15 శాతం‌ కన్వీనర్ కోటాకి నాన్ లోకల్ విద్యార్దులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చునని..  తెలంగాణాలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో పూర్తిగా తెలంగాణా విద్యార్ధులకి అవకాశమిస్తూ ఇచ్చిన ఈ చీకటి జిఓని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 


ఏపీ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు ?


ఈ జీవో జారీ చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు.  ప్రభుత్వం‌ కోర్టుకి వెళ్లాల్సి ఉన్నా.. పట్టించుకోకపోవడంతో విద్యార్థులు  వెళ్లారన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు.  రాత్రికి రాత్రి హైదరాబాద్ సెక్రటేరియట్ ని తెలంగాణాకి పూర్తిగా అప్పగించారని గుర్తు చేశారు.  తెలంగాణ సీఎం కేసీఆర్  పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు.. ఇలాంచి  కురచ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారని.. విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.  జాతీయ పార్టీగా మారిన కెసిఆర్ సంకుచిత బుద్దితో ఎపి విద్యార్ధులకి అన్యాయం జరిగేలా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. 


జాతీయ పార్టీగా మారి ఈ సంకుచిత నిర్ణయాలేంటి ?


బిఆర్ ఎస్ గా మారామంటున్నారు... మహారాష్డ్రలో కొన్ని వార్డులలో నెగ్గామంటున్నారు ...ఇలాంటి జీవోలకు  మహారాష్ట్ర, ఆంధ్రాకి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.  ఆంధ్రాకి అన్యాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రకి అన్యాయం చేయదా ... ఈ అంశంపై ఏపీ సీఎం  వైద్య శాఖ మంత్రి తక్షణమే స్పందించాలన్నారు.   అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని.. వారు పోరాడుతూంటే కనీసం పట్టించుకోవడం లేదన్నారు.  సర్పంచ్ ఎన్నికలలో 90 శాతం గెలిచామన్నారు...ఇపుడా సర్పంచ్ లు రోడ్డెక్కారని  ..  ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచ్ లకి ఎందుకు కనీస గౌరవం ఇవ్వటం లేదో సమాధానం చెప్పాలన్నారు.  చట్టాలు, రాజ్యాంగం‌ పట్ల గౌరవం‌ ఉంటే సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.  


గురువారం పురందేశ్వరి బాధ్యతల స్వీకరణ !


ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి గురువారం బాద్యతలు స్వీకరించబోతున్నారని.. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేశామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.  గురువారం  ఉదయం 9.30 గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారని..  భారీ ర్యాలీగా విజయవాడ రాష్ట్ర కార్యలయానికి చేరుకుని ఉదయం 11 గంటలకి బాధ్యతలు పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.  12 గంటలకి  కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు...సోము వీర్రాజు పూర్తిస్ధాయి బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు.  పార్టీ సహ ఇన్ ఛార్జి సునీల్ ధియోధర్, సోము వీర్రాజు, మాజీ సిఎం‌కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్, ఎంపి సిఎం రమేష్, జీవీఎల్ సహా కీలక నేతలంతా పాల్గొంటారని తెలిపారు.  వచ్చే ఎన్నికలలో పురందేశ్వరి నేతృత్వంలో బిజెపి ముందుకు వెళ్తుందని..  ఎపి ప్రజలు బిజెపి వైపే ఉంటారనే నమ్మకముందని  విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.  ఈ నెల 16 న విజయవాడలో జిల్లా అద్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం..‌రాబోయే పది నెలల కార్యాచరణపై చర్చిస్తాం ..ఈ సమావేశంలో ఎపి ఇన్ చార్జి మురళీధర్, శివప్రకాష్ జీ పాల్గొంటారని తెలిపారు.