CM Jagan : ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో స్వల్ప చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్రం బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితే బాగోలేదేమో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆర్థిక పరిస్థితికిపై కేంద్రం, ఆర్బీఐకి టీడీపీ నేతలు తప్పుడు లేఖలు రాశారన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. చంద్రబాబు అండ్‌ టీమ్ లేనిది ఉన్నట్లు సృష్టించి ఏపీ శ్రీలంకలా అయిపోతుందని అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. మీడియా వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.


98.44 శాతం హామీలు అమలు  


వైసీపీ ఎన్నికల హామీల్లో 98.44 శాతం అమలు చేశామని సీఎం జగన్  శాసనసభలో తెలిపారు. కోవిడ్‌ తో ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక ‍ వ్యవస్థను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లామన్నారు. కేంద్రంతో పోలిస్తే ఏపీ అప్పులు తక్కువగానే ఉన్నాయని సీఎం జగన్‌ అన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు 17.45 శాతం పెరిగాయన్నారు. కేంద్రం కన్నా ఎక్కువ అప్పులు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని విమర్శించారు. ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు రూ.135 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయని సీఎం జగన్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అవి రూ. 2.69 లక్షల కోట్లకు చేరాయన్నారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 123.52 శాతం అప్పులు పెరిగాయని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్ర రుణాలు రూ.3.82 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు కేవలం 41.4 శాతం మాత్రమే పెరిగాయన్నారు. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గిందని వ్యాఖ్యానించారు. 


దేశంలో ఏపీ టాప్ 


"జీఎస్డీపీలో ఏపీ తెలంగాణ కన్నా ముందుంది. జీఎస్డీపీలో గతంలో 21 స్థానంలో ఉంటే 2019-20లో 6.89 శాతంలో ఆరో స్థానంలో ఉంది.  దేశంలో ఆరో స్థానానికి ఏపీ చేరుకుంది. ఈ మూడేళ్లలో టాప్ త్రీలో ఉన్నాం. 2020-21లో కేంద్రం విడుదల చేసిన గణంకాల ప్రకారం 11.43 శాతం పెరుగుదలతో ఏపీలో మొదటిస్థానంలో ఉంది. దేశ జీడీపీలో ఏపీ వాటా 2014-19 మధ్య 4.45 శాతం ఉంటే, 2019-22 మధ్య ఇది 5.0 శాతం పెరిగింది.  కోవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా జీడీపీ తగ్గిపోయింది. కోవిడ్ సమయంలో దేశంలో కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే పాజిటివ్ గ్రోత్ సాధించాయి. వాటిల్లో ఏపీ కూడా ఒకటి.  మూల ధనవ్యయం కింద గత ప్రభుత్వం రూ 76,139 కోట్లు ఖర్చు చేసింది. వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.55086.20 కోట్లు ఖర్చుచేసింది. చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి, పింఛన్లు, సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు. దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీమ్ ప్రకారమే దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బటన్ నొక్కడంతో నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ప్రభుత్వ పాలన విశ్వసనీయత ఉంది కాబట్టే సంక్షేమపథకాలు అమలుచేస్తున్నాం. "-సీఎం జగన్ 


Also Read : AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం


Also Read : Merugu Nagarjuna Comments : రోజా మాటలను వక్రీకరించారు - ఆమెకు దళితులంటే ఎంతో గౌరవమన్న మంత్రి నాగార్జున !