AP Capital supreme Court :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ వేశారు. కాగా ఇప్పటికే అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం, రైతులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నెల 31న అమరావతి రాజధాని కేసు విచారణ జరగనుంది.


అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతివాదులకు ఇటీవలే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు పంపింది. ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు పలువురు అధికారులు మొత్తం 261 మందికి  ఈ నోటీసులు జారీ అయ్యాయి. అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గతంలో అమరావతి నిర్మాణాల కాల పరిమితిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే నిరాకరించింది.
  
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ.. ఏపీ హైకోర్టు గతేడాది మార్చిలో తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై స్టే విధించింది. రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదని.. అది ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదంది. జనవరి 31న అన్ని అంశాలను విచారిస్తామని స్పష్టం చేసింది.  


తాజాగా శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను అమలు చేయాలంటూ.., పిటిషన్ దాఖలు కావడం ఆసక్తికరంగా మారింది. శివరామకృష్ణన్ కమిటీ  రిపోర్టును అమలు చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. అమలు చేశామని.. రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని సూచించిందని అప్పటి ప్రభుత్వ చెబుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని సూచించిందని అంటున్నారు. ఇప్పుడు ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు పరిగణనలోకి తీసుకుంటే.. ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. 


మరో వైపు ప్రభుత్వం , మంత్రులు మాత్రం సుప్రీంకోర్టులో విచారణ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తున్నామన్న ప్రకటనలు చేస్తున్నారు. ఈ వ్యవహారం సబ్ జ్యూడిస్ అవుతుదని తెలిసినా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ  ..  ప్రతీ వారం ఓ మంత్రి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ ను తరలిస్తామని చెబుతున్నరు. ముందుగా ఎం క్యాంప్ ఆఫీస్ మాత్రమే కాకుండా.. వివిదశాఖల కార్యాలాయలను కూడా తరలిస్తామని చెబుతున్నారు. మరో వైపు రైతులు అమరావతి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని రైతులు ధీమాగా ఉన్నారు.