ఏపీలో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రీజనల్ పాస్ పోర్ట్ అధికారి శివహర్ష శనివారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా బందరు రోడ్డులో ఈ రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


రోజుకు 2 వేలకు పైగా దరఖాస్తులు


రీజనల్ పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి రోజుకు 2 వేల దరఖాస్తులు వస్తున్నాయని, కొవిడ్ తర్వాత పాస్ పోర్ట్ కోసం అప్లై చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పాస్ పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు. అక్టోబర్ వరకూ 3 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామని చెప్పారు. పోస్టల్, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్ట్స్ త్వరితగతిన అందిస్తున్నామని వివరించారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ కేంద్రంగానే ఇకపై పాస్ పోర్ట్ ప్రింటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మరో 2, 3 నెలల్లోనే రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం పాస్ పోర్ట్ సేవలు సులభతరం చేశామని, తక్కువ సమయంలోనే అప్లై చేసిన వారికి అందిస్తున్నామని అన్నారు. ఫేక్ సైట్స్, బ్రోకర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ నమ్మొద్దని సూచించారు.


Also Read: గోమాతకు స్వయంవరం ప్రకటన - నందీశ్వరులకు ఆహ్వానం, వివాహ ఉత్సవానికి ఏర్పాట్లు, ఎక్కడంటే?