Badruddin Ajmal: 


బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలు..


ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్‌ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలలో నేరస్థులు ఎక్కువగా ఉంటారని అన్నారు. ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


"మనం అన్ని నేరాల్లోనూ నంబర్‌ వన్. దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు...ఇలా ఏ నేరాల్లో అయినా మనమే ముందుంటాం. జైలుకి వెళ్లేది కూడా ఎక్కువగా మనమే"


- బద్రుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్ 


సమర్థించుకున్న బద్రుద్దీన్..


ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు బద్రుద్దీన్. పైగా తానేమీ తప్పు మాట్లాడలేదని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చారు. ముస్లింలలో అక్షరాస్యత తక్కువగా ఉంటుందని, అందుకే నేరాలకు పాల్పడుతారని చెప్పారు. అసోం అసెంబ్లీలో AIUDFకి క్యాడర్‌ బాగానే ఉంది. అక్కడి 126 నియోజకవర్గాల్లో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీకి చెందిన వాళ్లే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ముస్లిం కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ల సంఖ్య తక్కువగానే ఉందని చెప్పారు బద్రుద్దీన్. 


"ప్రపంచవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ల సంఖ్య తక్కువ. మా వర్గంలో పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు. పై చదువులు చదవడం లేదన్నదే నా బాధ. కొంతమందైతే కనీసం పదో తరగతి కూడా పాస్ అవడం లేదు. వాళ్ల పరిస్థితి చూసి బాధతో ఆ మాటలు అన్నాను" 


- బద్రుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్ 


యువతకు సూచనలు..


మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ ప్రస్తావించారు బద్రుద్దీన్. అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిలు మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. వాళ్లతో మాట్లాడే తీరులోనూ మార్పు రావాలని స్పష్టం చేశారు. 


"అమ్మాయిలను చూడగానే కొంత మంది అబ్బాయిలు తొందర పడతారు. కానీ అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మన ఇస్లాం మతం చెప్పింది. మార్కెట్‌కి వెళ్లినప్పుడు, ఇంకెక్కడికైనా వెళ్లినప్పుడు అమ్మాయిలు ఎదురైతే అదే పనిగా చూడొద్దు. మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్న విషయం మర్చిపోవద్దు. ఇలా ఆలోచిస్తే ఎలాంటి తప్పుడు పనులు చేయరు"


- బద్రుద్దీన్ అజ్మల్, AIUDF చీఫ్ 


గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు


గతంలోనూ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు కూడా ముస్లింల విధానాన్ని అనుసరించి యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవాలని అన్నారు. "ముస్లింలలో పురుషులు 20-22 ఏళ్లకే పెళ్లి చేసుకుంటారు. మహిళలు కూడా మేజర్ కాగానే 18 ఏళ్లకు వివాహం చేసుకుంటారు. హిందువులు మాత్రం పెళ్లికి ముందే ఇద్దరి ముగ్గురితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్లు పిల్లల్ని కనడానికి ఇష్టపడరు. విలాసంగా గడుపుతారు. డబ్బు దాచుకుంటారు" అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కామెంట్స్ అక్కడితో ఆగలేదు. "హిందువులు 40 ఏళ్లు దాటాక తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకుంటారు. ఆ వయసులో పిల్లల్ని కని ఎలా పెంచగలరు..?" అని అన్నారు. కాస్త అభ్యంతరకరంగానూ మాట్లాడారు. దీనిపై హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు మరోసారి ముస్లిలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 


Also Read: ఐరాస జనరల్ అసెంబ్లీలో హమాస్ యుద్ధంపై తీర్మానం, ఓటింగ్‌కి దూరంగా భారత్