తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లేవని, వృద్ధి రేటులో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. తెచ్చిన రుణాలను సాగునీరు, మిషన్ భగీరథ, విద్యుత్ రంగంలో సంస్కరణలు, సంపద సృష్టి కోసం వినియోగించినట్లు వివరించారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయన్న కేటీఆర్, రాబోయే ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.


సంక్షేమానికే పెద్దపీట


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించామని, సంక్షేమం, అభివృద్ధికే పెద్దపీట వేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో అటు పల్లెలు, ఇటు పట్టణాల్లో సమానంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. 


ఉద్యోగాల కల్పనలో ముందంజ


దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే, ఒక్క హైదరాబాద్ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ జరిగిందని వివరించారు. మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. అలాగే, ప్రతీ జిల్లాకో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గతంలో మైగ్రేషన్ కు పర్యాయపదంగా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్ కు పర్యాయపదంగా మారిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం రూపుమాపిందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం సాధించామని, వాటికి సంపూర్ణ న్యాయం చేశామని వెల్లడించారు.


కాంగ్రెస్ పై విమర్శలు


కాంగ్రెస్ కు ప్రజలు 55 ఏళ్లపాటు అవకాశం ఇచ్చారని, కేంద్రంలోని బీజేపీ పదేళ్లు అవకాశం ఇచ్చారని, అయినా చేసిన అభివృద్ధి ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలాగూ కుప్పకూలిందని, తెలంగాణలో 4 సీట్లైనా వస్తాయనేదే ఆ పార్టీ నేతల ఆరాటమని ఎద్దేవా చేశారు. కర్ణాటక మోడల్ గా కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని, అక్కడి రైతులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. వారికి మేము డబ్బులిచ్చి తీసుకొచ్చామని హస్తం నేతలు ఆరోపిస్తున్నారని, 'కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. అందుకు సిద్ధమేనా?' అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.


రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ న్యాయం చేశారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపైనే ప్రజలకు నమ్మకం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధే కేసీఆర్ ను మళ్లీ సీఎంగా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదన్న ఆయన, ప్రధాని మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశంలో పేదలందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్నారని, అందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారని, అవన్నీ జరిగాయా? అంటూ నిలదీశారు. మైనార్టీలకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత బడ్జెట్ తెలంగాణలోనే ఉందని కేటీఆర్ వివరించారు.


'మేడిగడ్డ'పై స్పందన


ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ ఘటనపైనా కేటీఆర్ స్పందించారు. 'మేడిగడ్డ బ్యారేజీ కట్టి పదేళ్లు పూర్తైంది. ప్రజలకు సంబంధించి ఒక్క పైసా కూడా వృథా కాదు. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని బ్యారేజీ నిలబడింది. ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వంతెనను పరిశీలించింది. కాళేశ్వరం చివరి ఆయకట్టుకూ నీళ్లు అందుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీల విమర్శలు సరి కాదు.' అని కేటీఆర్ అన్నారు.