రాజకుమార్తెలకు స్వయంవరం ప్రకటించడం రాజుల కాలంలో జరిగేదని మనం వినుంటాం. రాజ కుమారులు ఆ రాజ్యంలో స్వయంవరానికి హాజరై వారు పెట్టిన పరీక్షల్లో నెగ్గితే, రాజ కుమార్తె వారి మెడలో వర మాల వేసి వరిస్తుంది. ఇది అప్పటి మాట. కానీ, తాజాగా ఏపీలో కాకినాడ జిల్లాలోనూ స్వయంవరం ప్రకటించారు. అయితే, ఇది రాజకుమార్తెకు కాదండోయ్.. ఓ గోమాతకు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. సంప్రదాయం ప్రకారం సదరు గోమాతకు ఓ దంపతులు స్వయంవరం ప్రకటించి ఘనంగా వివాహ మహోత్సవం చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ కథేంటో చదివేయండి.


కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఏపీఎస్పీ ఎదురుగా తిరుమల ఆస్పత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు ఓ గోమాతను తమ బిడ్డలా చూసుకుంటున్నారు. వృత్తి పరంగా వైద్యులైన ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నా వారి కంటే ఎక్కువ ప్రేమను ఈ గోవుపై చూపుతారు. సరిగ్గా 20 నెలల క్రితం 2022, జనవరి 22న గోవుకు ఘనంగా బారసాల, ఊయల వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించి 'సారణ'గా పేరు పెట్టారు. అప్పట్లో ఈ తతంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


స్వయంవరం ప్రకటన


ఇప్పుడు 21వ మాసంలోకి అడుగు పెట్టిన 'సారణ'కు వివాహ వయసు రావడంతో వైద్య దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల్లోని నందీశ్వరులకు ఆహ్వానం పంపారు. ఏపీఎస్పీ ఫంక్షన్ హాలు వద్ద ఖాళీ స్థలంలో సుమారు 12 మంది నందీశ్వరులను వరుసలో ఉంచితే, వరమాలతో 'సారణ' తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుంది. 


ఘనంగా ఏర్పాట్లు

ఈ కార్యక్రమానికి వైద్య దంపతులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఫంక్షన్ హాలు సమీపంలో 'సారణ' వరమాలతో నందీశ్వున్ని ఎంపిక చేసుకున్న అనంతరం వివాహ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు వస్తున్నారని, శాస్త్రోక్తంగా కల్యాణం జరుపుతారని గౌరీశేఖర్ తెలిపారు.


జంతువులతో ముఖ్యంగా గోవులతో మనుషులకు ఎంతటి అనుబంధమో ఈ ఘటన తెలియజేస్తుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. గోవును దైవంగా, తమ బిడ్డగా భావించి ఇలా వేడుకలు జరపడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ దంపతులను అభినందిస్తున్నారు.


Also Read: హెచ్చరిక! తిరుమల నడకదారిలో మళ్లీ పులి, ఎలుగు కలకలం - కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు