AP CM Chandrababu | అమరావతి: పేదరిక నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పీ4 విధానాన్ని ఉగాది (Ugadi 2025) పండుగ నుంచి ప్రారంభిచనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు. పీ4 విధానం (P4 Model) ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 శాతం మంది... అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. పీ4 విధానం (పబ్లిక్- ప్రైవేట్- పీపుల్స్- పార్ట్నర్షిప్)పై విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్లానింగ్ శాఖపై సచివాయంలో సమీక్ష
పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు సేకరించి, తగిన మార్పులు చేర్పులు చేసిన అనంతరం ఏపీలో పీ4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్లానింగ్ శాఖపై సచివాయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా పీ4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు కొంత ఉన్నత స్ధాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వీరందర్నీ ఒక ప్లాట్ఫాం కిందకు తెచ్చి రాష్ట్రంలో ఉగాది నుంచి పీ4 విధానం అమలు చేస్తామన్నారు. దాంతోపాటు ప్రత్యేక సర్వే ద్వారా అట్టగుడున ఉన్న వర్గాలను గుర్తించి, వారికి సాయం చేస్తామన్నారు. అందుకు అవసరమైన డేటాను సేకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
పేదరిక నిర్మూలనకు పీ4 మోడల్
తమ సొంత ఊళ్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని... అలా ఆసక్తి ఉన్న వారిని ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా పేదరిక నిర్మూలనకు పీ4 మోడల్ను రాష్ట్రంలో ఆవిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ సరికొత్త విధానం అమలు ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ఈ సమీక్షలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్లానింగ్ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.