Pawan Kalyan News Update: బీజేపీకి ఢిల్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. మెజార్టీ రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ వస్తున్న బీజేపీకి ఢిల్లీ మాత్రం అంత ఈజీగా మింగుడు పడటం లేదు. పదేళ్లుగా ప్రయత్నిస్తూ వస్తోంది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఢిల్లీలో జెండా పాతాలని డిసైడ్ అయింది. అందుకే అన్ని అస్త్రాలను వాడుకుంది. సోమవారం జరిగిన ప్రచారంలో విజయానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలూ చేసింది. ఇందులో భాగంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెలుగు నేతలతో ప్రచారం చేయించింది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయినర్స్‌లో చంద్రబాబు, పవన్ పేరు

ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ నుంచి బీజేపీకి మద్దతుగా నిలిచే నేతలంతా వెళ్లి ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లి ఆదివారం ప్రచారం చేశారు. ఢిల్లీలో ప్రచారం చేసే క్యాంపెయినర్స్ లిస్టులో సీఎం చంద్రబాబుతోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు కూడా ఉంది. కానీ చంద్రబాబు మాత్రమే ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్‌ మాత్రం ప్రచారం చేయలేదు. 

Also Read: గెలిచి ఓడిన టీడీపీ.. ఓడినా గెలిచిన వైసీపీ - తిరుపతి డిప్యూటీ మేయర్ పై రోజా కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ప్రచారానికి కూడా దూరం 

ఢిల్లీ ప్రచారానికే పవన్ కల్యాణ్‌ దూరంగా ఉండటం లేదు. ఈ మధ్య అసలు అధికారిక కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదు. ఈ మధ్య పుంగనూరులో జరిగిన పార్టీ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. అక్కడ నాగబాబు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఇప్పుడు పవన్ కల్యాణ్‌ కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. అసలు పవన్ కల్యాణ్‌కు ఏమైంది. ఆయన ఎందుకు బయటకు రావడం లేదనే విషయం పార్టీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. 

రేపటి నుంచి దక్షిణ భారత ఆలయాల సందర్శన 

పవన్ కల్యాణ్‌కు ఏమైంది వారం పది రోజుల నుంచి కనిపించడం లేదని ఆరా తీస్తే కీలక విషయం ఒకటి వెలుగు చూసింది. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న పవన్ ..మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజులపాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించబోతున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ దర్శించుకోనున్నారు. 

పూర్తి గోప్యంగా సింగపూర్ టూర్ 

వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుకుండటంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి కేరళ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. ముందుగా కేరళలోని త్రివేండ్రం చేరుకోవటంతో ఆలయాల సందర్శన ప్రారంభిస్తారు. త్రివేండ్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ దర్శించుకోనున్నారు. 

టూర్‌ షెడ్యూల్‌ ఇదే 

ఆ తర్వాత కొచ్చి వెళ్లి అక్కడ ఆలయాలు..కొచ్చి ఫోర్ట్‌ను పరిశీలిస్తారు. గురువాయూర్, త్రిసూర్‌లో పవన్ పర్యటన ఉంటుంది. కేరళ పర్యటన తర్వాత మూడు రోజులు తమిళనాడులో టూర్ ఉంటుంది. అరక్కోణం, మధురై ప్రాంతాల్లో పర్యటన సాగనుంది. పవన్‌తోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణ తేజ ఈ టూర్‌లో పాల్గొంటారు. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన తనతో తీసుకెళ్తున్నారు పవన్. 

ఆలయాల టూర్‌ కూడా గోప్యంగానే!

పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన గురించి ఉపముఖ్యమంత్రి కార్యాలయం గోప్యత పాటించే అవకాశం ఉంది. ఆయన సింగపూర్ పర్యటన గురించి ఎక్కడా సమాచారాన్ని వెల్లడించలేదు. వ్యక్తిగత పర్యటన కావటంతో వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది. సనాతన ధర్మ పరిక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే తన లక్ష్యాన్ని తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలోనే ప్రకటించారు. అప్పుడే ప్రముఖ హైందవ ఆలయాలను సందర్శించాలనే నిర్ణయానికి వచ్చారు. పల్లె పండుగ కార్యక్రమం పూర్తైన తర్వాత ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకోవటంతో బుధవారం నుంచి కేరళ, తమిళ్‌నాడుల్లో పర్యటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: కూటమికి ఓటేసి భూమన కాళ్లపై పడ్డ ముగ్గురు కార్పొరేటర్లు - బెదిరించారని గగ్గోలు