Rythu Bazar Employees: ఏపీ సర్కారు రైతు బజార్ల సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. వారికి వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. విశాఖ, విజయవాడ, గుంటూరులోని రైతు బజార్ల ఎస్టేస్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి 26 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సూపర్ వైజర్లకు 15 వేల నుంచి 18, 500కు వేతనాలు పెరిగాయి. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతు బజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి 24 వేల రూపాయలకు, అదే సూపర్ వైజర్లకు రూ.12 వేల నుంచి రూ15 వేలకు జీతం పెరిగింది. ఇక సెక్యూరిటీ గార్డుల వేతనం విషయానికి వస్తే.. ప్రాంతాలతో సంబంధం లేకుండా 12 వేల రూపాయల నుంచి 15 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 


ఏటా రూ.11.87 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం..


ఈ పెంచిన జీతాలను డిసెంబర్ నెల నుంచి అందించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 రైతు బజార్లు ఉండగా.. ప్రతి రైతు బజారుకు ఓ ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఆదాయాన్ని బట్టి కొన్నింటిలో సూపర్ వైజర్లను కూడా నియమించారు. ఎస్టేట్ ఆఫీసర్లు లేని చోట సూపర్ వైజర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. స్థానిక మార్కెట్ కమిటీలే 2021 వరకు ఈ ఖర్చులు భరించేవి. ప్రభుత్వ చర్యల ఫలితంగా 76 రైతు బజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. ఏటా రూ.11.87 కోట్ల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రైతు బజార్లు కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. 


ప్రస్తుతం 75 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 28 మంది సూపర్ వైజర్లు, 212 మంది సెక్యూరిటీ గార్డులు, మరో ఐదుగురు హార్టికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో 188 మంది కాంట్రాక్టు, 132 మంది అవుట్ సోస్రింగ్ లో పని చేస్తున్నారు. వీరి జీతాల కోసం ప్రతి నెలా రూ. 57 లక్షలు, రైతు బజార్ల నిర్వహణకు మరో 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు జీతాలు పెంచడంతో నిర్వహణ కాస్త పెరగనుంది. 


1999లో ఏర్పడ్డ రైతు బజార్లు..


రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న కమతాలున్న చిన్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బజార్లను నిర్వహిస్తోంది. 1999 జనవరిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మొదటి మార్కెట్ ప్రారంభమైంది. ఈ మార్కెట్ లో రైతులు తాము పండించిన కూరగాయలను వినియోగదారులకు నేరుగా విక్రయిస్తారు. ఈ మార్కెట్ లో రైతులకు, వినియోగదారులకు మధ్య మధ్యవర్తుల జోక్యం ఉండదు. రైతులు, వినియోగదారులు ఇద్దరూ మధ్యవర్తుల దోపిడీకి గురికాకుండా ఈ పద్ధతి బాగుంటుందని ఒకే అభిప్రాయానికి వచ్చారు. అందువలన వ్యవసాయ ఉత్పత్తులు తాజాగా, ఆర్థికంగా అందుబాటులో లభిస్తాయి. రైతులు తాము పండించిన కూరగాయలను తమ పొలంలో స్వయంగా విక్రయించటం ద్వారా దళారుల ప్రభావం ఉండదు. అలాగే ఇతర కూరగాయల మార్కెట్లలో ధరల కంటే రైతు బజారు మార్కెట్‌లో ధరలు తక్కువగా ఉండడానికి సహాయపడతాయి. ఈ విధానం పండించే రైతుకు, వినియోగ దారుడికి ఎంతో ఉపయోగకరంగా ఉంది.