Anantapur News: సాధారణ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో జరిగిన అల్లర్లు.. హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై  విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో సిట్ బృందం నిన్న రాత్రి తాడిపత్రి పట్టణానికి చేరుకుంది. ముఖ్యంగా పోలింగ్ రోజున జరిగిన అల్లర్ల పైన అలాగే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదం.. రాళ్లు రువ్వుకోడం లాంటి  హింసాత్మక ఘటన పైన సిట్ బృందం పరిశీలన కొనసాగుతోంది. ముఖ్యంగా  తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటన పైన అలాగే పోలీసులు వ్యవహరించిన తీరుపై, వివాదాస్పదమైన డీఎస్పీ చైతన్య వ్యవహారం పైన కూడా సిట్ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ముందుగా తాడిపత్రి చేరుకున్న సిట్ బృందం పట్టణ పోలీస్ స్టేషన్లో డీఐజీ షిమోషితో సమావేశం అయ్యారు. 


వివిధ కోణాల్లో విచారణ
దశాబ్దాల కాలంగా ఇక్కడ జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తగిన బందోస్తు చర్యలు చేపట్టలేదా? పోగేసిన రాళ్లగుట్ట ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారు? జిల్లా ఎస్పీ అమిత్ పైన రాళ్ల వర్షం కురిపించేంత హింసను ఎందుకు అదుపు చేయలేకపోయారు? గతంలో తాడిపత్రి డీఎస్పీగా పనిచేసిన చైతన్యపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అన్న కోణాల్లో సిట్ బృందం పరిశీలిస్తుంది. సిట్ బృందంలో ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావుతోపాటు ఏసీబీ డీఎస్పీ భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జిఎల్ శ్రీనివాసరావు ఉన్నారు. తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పలు రికార్డును పరిశీలించారు. అనంతరం డీఐజీ సిమోషితో సమావేశమయ్యారు. 


ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద జరిగిన హింసాత్మక ఘటనలను గురించి అడిగినట్లు సమాచారం. పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం ఎన్నికల రోజున దాడులు జరిగిన ఓం శాంతి నగర్ తో పాటు పాతకోట, గానుగ వీధి ప్రాంతాల్లో పర్యటించారు. గొడవల గురించి స్థానికులను సిట్ బృందం అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇళ్లను సిట్ బృందం పరిశీలించారు. పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవకు ప్రధాన కారణాలు ఏంటి? రాళ్లదాడి ఏ విధంగా జరిగింది? అన్న కోణాలు పరిశీలిస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో బందోబస్తు సిబ్బందితో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు.


ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆచూకీపై లేని స్పష్టత
ఇప్పటివరకు తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో భాగంగా 575 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత రావట్లేదు. జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం అనారోగ్య కారణాలవల్ల హైదరాబాద్లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 575 మంది పైన కేసు నమోదు చేసిన పోలీసులు వీరిలో 120 మందిని అరెస్టు చేసి ఉరవకొండ కోర్ట్ లో హాజరు పర్చారు.


అనంతరం కడప జైలుకు 90 మందిని రిమాండ్ కు పంపారు. మరో 30 మందిని జిల్లాలోని వివిధ జైళ్లలో రిమాండ్ లో ఉంచినట్లు సమాచారం. అల్లర్లలో పాల్గొన్న మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్నంతో పాటు తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఈ అల్లర్లు అదుపు చేయలేక పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎస్పీ అమిత్ ను సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ రంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణ మరికొందరి పోలీసులు పైన వేటు వేసింది. అయితే తాడిపత్రి పట్నంలో అల్లర్లపైన హింసాత్మక ఘటన పైన విచారణ చేపట్టిన సిట్ బృందం నివేదిక అనంతరం మరి కొంతమంది అధికారులు పైన వేటుపడే అవకాశం ఉందంటూ జోరుగా చర్చ సాగుతోంది.