Palle Raghunath Reddy : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలెక్టర్ అయిపోయారు. అదేంటి ఆయన ఎప్పుటు సివిల్స్ రాశారు, ఎప్పుడు కలెక్టర్ అయిపోయారనే సందేహం రావొచ్చు. ఆయన కలెక్టర్ అయ్యింది రియల్ గా కాదు రీల్ లో. అదేనండి సినిమాలో కలెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. అనంతపురంలో ఐక్యూ అనే సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను గురువారం ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. పల్లె రఘునాథ్ రెడ్డి కలెక్టర్ పాత్రలో కమిషనర్ కు వార్నింగ్ ఇస్తున్న షాట్ షూట్ చేశారు. 



(ఐక్యూ మూవీ పోస్టర్)


కమిషనర్ కు వార్నింగ్ 


ఈ షాట్ లో పల్లె రఘునాథ్ రెడ్డి కమిషనర్ తో నేను టై కట్టుకున్నంత వరకే కలెక్టర్, టై తీసేశానంటే టైగర్. కమిషనర్ నేను ఒకసారే చెప్తా రెండో సారి చెప్పను. చెప్తే మీరుండరు... అనే డైలాగ్ చెప్పారు.  కమిషనర్‌కు ఆయన వార్నింగ్‌ ఇచ్చే సీన్ స్థానిక పీవీకేకే ఇంజినీరింగ్‌ కళాశాలలో షూటింగ్ చేశారు. సాయిచరణ్‌, పల్లవి హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. జీఎల్‌బీ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పోలూరి ఘటకాచలం స్టోరీ, మ్యూజిక్ అందిస్తున్నారు.



సెలబ్రిటీ ఎలా అయ్యారు? 


ఓ సాధారణ విద్యార్థి సెలబ్రిటీగా ఎలా మారారు, ఎందుకు మారాల్సి వచ్చింది అనే కథాంశంతో ఐక్యూ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెలబ్రిటి అయ్యే క్రమంలో ఎదురైన అవాంతరాలను ఆమె ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో సినిమా రూపొందుతుందని దర్శకుడు జీఎల్‌బీ శ్రీనివాస్‌ తెలిపారు. సాయిచరణ్‌, పల్లవి జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ బుధవారం అనంతపురంలో ప్రారంభం అయింది. నేటి యువత ఒకవైపు చదువులో రాణిస్తూ, సెలబ్రిటీలుగా పేరు తెచ్చుకోవాలనే తపనతో ఉంటున్నారు. వారికి ప్రేరణ కలిగించే చిత్రంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు అన్నారు. కుటుంబ నేపథ్యంలో, కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం సన్నివేశాలు , సమాజానికి స్ఫూర్తి ని ఇచ్చేలా కథా సారాంశం ఉంటాయని చిత్ర నిర్వాకులు వెల్లడించారు.


Also Read : New liquor policy in AP : మూడేళ్లకు బార్ పాలసీ - మద్యనిషేధం లేనట్లేనని తేల్చిన జగన్ సర్కార్ !