YS Jagan Latest News: దేశంలో ఏం నడుస్తోంది అంటే...  నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ నడుస్తోంది అని ఠక్కున సమాధానం వస్తుంది. ముఖ్యంగా దక్షిణాది ఈ అంశం పెను దుమారాన్నే రేపుతోంది. అందుకే దీన్ని వాయిదా వేయాలని చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్డీఏ పార్టీలు మాత్రం ఈ విషయంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. ఏ కూటమికి చెందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. 


వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని సమస్యలతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న విషయాలపై కూడా ఏం చేయాలో ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. 


తాడేపల్లిలో జగన్ నివాసంలో జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంపీలు చొరవ చూపాలని ప్రజా సమస్యలపై గళమెత్తాలని జగన్ దిశానిర్దేశం చేశారు. 


Also Read: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి


ఈ సందర్భంగానే నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని జగన్ అభిప్రాయపడ్డారు. కేంద్రం స్పష్టత ఇచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. వేర్వేరు వాదనలు తెరపైకి వస్తుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొని ఉందని దానికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సింది కేంద్రమే అన్నారు. 




ఈసారి సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆ బిల్లు వచ్చిన వేళ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు పట్టుబట్టాలని సూచించారు. చాలా దేశాల్లో ఇంకా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఇక్కడ కూడా అదే విధానం తీసుకువచ్చేలా డిమాండ్ చేయాలని చెప్పారు.  


వీటితోపాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం, స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీలు ఇలా అన్నింటిపై గట్టిగా స్వరం వినిపించాలని జగన్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు జగన్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభలో గట్టిగా స్వరం వినిపించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టు ఎత్తు వివాదంపై కూడా జగన్ రియాక్ట్ అయ్యారు. ఎంతో కీలకమైన ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తుంటే టీడీపీ పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. 


పోలవరం విషయంలో టీడీపీ ఎంపీలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించిన ముందుకు రాలేదని జగన్‌కు ఎంపీలు చెప్పారు. ఎత్తు విషయంలో ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేయాలనే ప్రతిపాదనను తిరస్కరించారని వివరించారు. పోలవరం ఎత్తు విషయాన్ని తేలిగ్గా తీసుకొవద్దని పార్టీ ఎంపీలకు జగన్ సూచించారు. రెండు సభల్లో గట్టిగా పట్టుబట్టాలని తెలిపారు.  


Also Read: విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం కొద్ది రోజులే - బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు ?