Just In





Polavaram Project: పోలవరం తొలిదశ డీపీఆర్కు ఆమోదముద్ర పడేనా- రేపటి కేంద్ర కేబినెట్ ఏ నిర్ణయం తీసుకోనుంది?
Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్ సిద్ధమైంది. కేంద్రం ఆమోదమే తరువాయి. కేంద్ర కేబినెట్ సమావేశంలో... డీపీఆర్కు ఆమోదముద్ర పడితే.. రాష్ట్రానికి రూ.12వేల కోట్ల నిధులు అందనున్నాయి.

Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజల కలల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే... రాష్ట్రంలోని రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయి. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని... నిల్వచేసి... రైతులు అందిచవచ్చు. అయితే... ఈ ప్రాజెక్టు.. కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఈ ప్రాజెక్టును... రాష్ట్రంలో ఏర్పాటయిన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తోంది. కొత్త ప్రాజెక్ట్ డిజైన్ను సిద్ధం చేసింది. ఈ డీపీఆర్కు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహామండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదముద్ర వేశాయి. ఇక.. ఫైనల్గా కేంద్రం కేబినెట్ (Central Cabinet) ఆమోదం కావాల్సి ఉంది. అందుకే... రేపు(బుధవారం) ప్రధాని మోడీ(PM MODI) అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ అజెండాలో... పోలవరం డీపీఆర్(Polavaram DPR) అంశాన్ని కూడా చేర్చారు. రేపు(బుధవారం) పోలవరం డీపీఆర్కు కేంద్రం ఆమోద ముద్ర వేయబోతున్నట్టు సమాచారం.
పోలవరం కొత్త డీపీఆర్లో ఏముంది..?
పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణానికి 30వేల 436 కోట్ల రూపాయలతో డీపీఆర్ను సిద్ధం చేశారు. 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వచేసేలా అన్ని సాంకేతిక అంశాలను డీపీఆర్లో పొందుపరిచారు. వాస్తవిక డిజైన్లో తొలిదశ, మలిదశ అన్న అంశాలు లేకపోయినా.. కేంద్రం నుంచి నిధులను త్వరగా రాబట్టేందుకు... రెండు దశలను ప్రస్తావిస్తున్నారు. 41.15 మీటర్ల వరకు నిర్మాణానికి అవసరమైన అంచనా వ్యయాన్ని తొలిదశ డీపీఆర్లో పొందుపరిచారు. గతంలో 2010-11 ధరలతో 16వేల కోట్లకు డీపీఆర్ కేంద్రం ఆమోదం పొందింది. దాని ప్రకారం నిధులన్నీ కేంద్రం చెల్లించింది. ఇక... తొలిదశ పేరుతో సిద్ధంగా ఉన్న డీపీఆర్ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందితే... రాష్ట్రానికి మరో రూ.12,157 కోట్లు వస్తాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థులను దృష్టిలో పెట్టుకుని ఈ నిధులను ముందుగానే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది.
రేపటి కేంద్ర కేబినెట్ సమావేశంలో రెండో దశపై చర్చకు వస్తుందా...?
రేపటి కేంద్ర కేబినెట్ సమావేశంలో తొలదశ డీపీఆర్ను ఆమోదం లభిస్తోందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే...ఈ సందర్భంగా రెండో దశపై కూడా చర్చిస్తే బాగుంటుందన్న డిమాండ్ వినిపిస్తోంది. తొలిదశ డీపీఆర్ను ఆమోదిస్తే... మరో డీపీఆర్ను ఆమోదించబోమని.. గత ప్రభుత్వంతో చర్చల సందర్భంగా స్పష్టంగా చెప్పాయి కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు. అయితే.. కొత్త డీపీఆర్ను ఆమోదించలే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం... అలాంటి షరతులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత డీపీఆర్ ఆమోదం పొందడంతో పాటు... రెండో దశ డీపీఆర్కు నిధులు ఇచ్చేలా.... కేంద్రంలో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. కేంద్రంలోని NDA సర్కార్లో ఏపీ ప్రభుత్వం కీలకంగా ఉన్నందున... ఇది అసాధ్యం కాదన్నది విశ్లేషకుల మాట. అయితే... ప్రభుత్వం ఆ దిశగా... చర్చల్లో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇప్పటికే కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు....
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం... పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. అయితే.. నిర్మాణ పనుల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుటోంది. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేలా అడుగులు వేగంగా ముందుకు పడాలంటే... కేంద్రం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. దీంతో.. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. ప్రధాని మోడీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman), జలవనరుల శాఖ మంత్రి పాటిల్(Water Resources Minister Patil)తో పోలవరం నిధులపై చర్చించారు. వారు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో... రేపటి కేంద్ర కేబినెట్ ముందుకు పోలవరం తొలిదశ డీపీఆర్ రానుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయం కోసం ఏపీ ప్రభుత్వం కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తొలిదశ డీపీఆర్కు ఆమోదం లభిస్తే.. ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు తీసుకువెళ్లొచ్చన్నది ఏపీ సర్కార్ అభిప్రాయం.
Also Read: మదనపల్లి మంటల కేసులో మరో ట్విస్ట్- మద్యం పాలసీ గుట్టు రట్టైనట్టు సమాచారం