ఏపీ సెక్రటేరియట్‌లో సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.అర్ధరాత్రి తరువాత వెల్లడైన ఫలితాల్లో అధ్యక్షుడిగా కాకర్ల వెంకట్రామిరెడ్డి వర్గం మరోసారి విజయం సాదించింది. వరుసగా రెండోసారి అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ స్వీప్ చేసింది.


280 ఓట్ల మెజారిటీతో వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక శాతం ఓట్లు వెంకట్రామిరెడ్డికి దక్కాయి. 720 ఓట్లు వెంకట్రామిరెడ్డికి పోలవగా, ప్రత్యర్థి రామకృష్ణకి 432 ఓట్లు పోలయ్యాయి. మహిళ వైస్ ప్రెసిడెంట్‌గా సత్య సులోచన విజయం (351ఓట్లతో) ,ప్రధాన కార్యదర్శిగా శ్రీ కృష్ణ  (339), వైస్ ప్రెసిడెంట్‌గా ఎర్రన్న యాదవ్ (478),
అడిషనల్ సెక్రెటరీగా గోపి కృష్ణ (692) మహిళా జాయింట్ సెక్రటరీగా ఆర్ రమాదేవి ( 402), జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజెషన్) మనోహర్‌(647), స్పోర్ట్స్ సెక్రెటరీగా సాయి (404), కోశాధికారిగా కె వెంకటరావు (575) విజయం సాధించారు. అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్‌లో వెంకటరామిరెడ్డి ప్యానల్ విజయం సాదించటంపై ఆయన వర్గం హర్షం వ్యక్తంచేశారు.


అందరికి ధన్యవాదాలు...


తనను మరోసారి గెలిపించిన వారందరికి వెంకట రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఎవరెన్ని విమర్శలు చేసినా ఉద్యోగులు తన వైపే ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. ఎన్నికలనగానే చాలా అసత్యాలు ప్రచారం చేశారని, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు చూసి ఎన్నికలకు వెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలనే తాను ఎన్నికలకు వెళ్లానని తెలిపారు. నిజాయితీగా పని చేసే వారికే ఉద్యోగులు పట్టం కట్టారని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వివరించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.


రాజకీయం మెదలైంది...
ప్రభుత్వంపై ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని, జీతాలు కూడ ఇవ్వలేని పరిస్దితుల్లో సర్కార్ వైఫల్యాలపై ఇప్పటికే తీవ్ర స్దాయిలో చర్చ నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు నిర్వహించారు. మొదట్లో వెంకట రామిరెడ్డి విజయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటంలో విఫలం కావటం వలనే నేడు ఉద్యోగులు సమస్యల వలయంలో చిక్కుకున్నారని ఉద్యోగ సంఘాల నేతలుమండిపడ్డారు. వాస్తవానికి పోటీ లేకపోయినప్పటికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే ప్రత్యర్థిగా రామకృష్ణను నిలబెట్టి ఎన్నికలకు సమాయత్తం అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో ఎన్నికపై ఉత్కంఠత నెలకొంది. ఇదే సమయంలో పోలింగ్ పూర్తైన వెంటనే వెంకటరామిరెడ్డి విజయంపై ప్రచారం జోరందుకుంది. 


ఎన్నికల్లో వెంకటరామిరెడ్డికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే,అది ప్రభుత్వం పై ప్రభావం చూపుతుందనే ఊహాగానాలు కూడా వ్యక్తం అయ్యాయి.ఇదే కారణంతో ఎన్నికల్లో వెంటకరామిరెడ్డిని గెలిపించాలనే ఒత్తిడి కూడ సచివాలయ ఉద్యోగులపై పడిందని, అందులో భాగంగానే వెంకటరామిరెడ్డి ప్యానల్ విజయం సాధించిందనే ప్రచారం జరుగుతుంది.


ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత లేదు


ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ప్రచారంలో వాస్తవం లేదని ఉద్యోగుల సంఘం నాయకులు అంటున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, అసలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్న వేళ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో వెంకటరామిరెడ్డి విజయం తరువాత అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనని తేలిందని అంటున్నారు.