Nara Bhuvaneshwari: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఉంటున్న ఆయన సతీమణి నారా భువనేశ్వరిని కలిసేందుకు అమరావతి ప్రాంత రైతులు రాజమహేంద్రవరంకు బయల్దేరారు. అమరావతి ప్రాంత తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాల్లో రాజమండ్రికి బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర రాజధాని అమరావతి రూపశిల్పి చంద్రబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని రైతులు అన్నారు. ఇలాంటి సమయంలో తాము అంతా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని అన్నదాతలు పేర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత అమరావతి రైతులు అంతా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడే బస చేస్తున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని, లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలపనున్నారు. 


రేపు విజయవాడకు నారా లోకేశ్


బుధవారం (అక్టోబర్ 4) ఉదయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరు కానున్నారు. ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో సీఆర్‌పీసీ 41ఏ  కింద ఢిల్లీలో నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రాష్ట్రపతి, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధుల దృష్టికి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశాన్ని నారా లోకేశ్ తీసుకెళ్లారు. 


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును సీఐడీ సెప్టెంబర్ 26న చేర్చింది. లోకేశ్ పేరును ఏ - 14గా సీఐడీ చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు.


నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు(అక్టోబరు 3) విచారణకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా పేర్కొని అరెస్టు కూడా చేశారు. అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ను గత నెల మూడో వారంలో దాఖలు చేశారు. ఇది నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందుకు రానుందని ‘లైవ్ లా’ ట్వీట్ చేసింది.


విచారణకు విముఖత చూపిన జడ్జి


సెప్టెంబరు 27న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి (బెంచ్) బదిలీ చేశారు. దీంతో పిటిషన్ విచారణ అక్టోబరు 3కి వాయిదా పడింది. ఆ రోజు తొలుత ఈ పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం ముందుకు రాగా, వారిలో ఓ న్యాయమూర్తి ఈ కేసు వినేందుకు సుముఖత చూపలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పడంతో మరో బెంచ్ కు బదిలీ చేయాల్సి వచ్చింది. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, రెండో న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఉన్నారు. జస్టిస్ భట్ ఈ పిటిషన్ విచారణకు నిరాకరించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... ‘‘మై బ్రదర్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి ఈ పిటిషన్ విచారణపై కొన్ని అంతరాలు ఉన్నాయి. మిస్టర్ హరీష్ సాల్వే మేం ఈ పిటిషన్‌ని మరో బెంచ్ కి బదిలీ (పాస్ ఓవర్) చేస్తాము’’ అని అన్నారు.