Thiruvuru MLA Srinivasa Rao Created Anarchy: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తొందరపాటు చర్య విమర్శలు పాలవుతోంది. బాధితులకు సత్వర న్యాయం పేరుతో ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్రస్థాయిలో ఉద్రిక్తత కారణమైంది. ఎమ్మెల్యే అరాచకంతో ఎ కొండూరు ఎంపీపీ ఇల్లు ధ్వంసమైంది.


ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడులో వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు భవనం నిర్మిస్తున్నారు. ఈ భవనం నిర్మించిన స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్నారని కంభంపాడుకు చెందిన ముస్లిం మహిళతోపాటు విస్సన్నపేటకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు అనంతరం ఆదివారం కంభంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు. అది అక్రమ నిర్మాణంగా భావించిన ఆయన వాటిని తొలగించి బాధితులకు స్థలం అప్పగించాలని ఆదేశించారు. అధికారులు తొలగించకపోతే తానే కూల్చివేస్తానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. మంగళవారం ఉదయమే తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పోక్లైన్, బుల్డోజర్ తో భవనం వద్దకు చేరుకున్నారు.


వైసీపీ ఎంపీపీ వర్గం కూడా అక్కడకు భారీగా చేరుకుంది. ఇరు వర్గాల నుంచి భారీగా జనాలు మోహరించారు. దీంతో భద్రాచలం జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆక్రమణలు తొలగించే వరకు అక్కడ నుంచి కదిలేది లేదని ఎమ్మెల్యే తన వాహనంపైకి ఎక్కి కూర్చున్నారు. దీంతో అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. అయితే ,ఈ భవనం కూల్చివేత చర్యలను మైలవరం ఏసీబీ మురళీమోహన్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కట్టడం కూల్చవద్దని, సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకెళ్లారు.


బాధితులకు తక్షణమే న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు ఎమ్మెల్యే. ప్రొక్లెయిన్ సిబ్బంది కూడా డాబా దిగువ ఒకవైపు పాక్షికంగా కూల్చేశారు. ఆక్రమణను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ఆ స్థలంలోకి ఎవరూ రావద్దని అధికారులు స్పష్టం చేయడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్ఎస్ నెంబర్ 197/14లో నిర్మిస్తున్న ఆ భవనానికి అనుమతులు లేవని, అది అక్రమ నిర్మాణం అని పంచాయతీ కార్యదర్శి నోటీసును అంటించారు.


తాము ఎవరు స్థలము ఆక్రమించలేదని, అక్రమంగా భవనం నిర్మించడం లేదంటూ ఎంపీపీ నాగలక్ష్మి తేల్చి చెప్పారు. భవనాన్ని ఎలా కూల్చివేస్తారో చూస్తామంటూ అనుచరులతో కలిసి ఒకటో అంతస్తులో బైఠాయించారు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి స్వామి దాసు ఎంపీపీకి మద్దతుగా వచ్చారు. తమ భవనం కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తామని ఎంపీపీ నాగలక్ష్మి చెప్పారు. ఎమ్మెల్యే హడావిడి, అత్యుత్సాహం దాదాపు రెండు గంటలపాటు ఉద్రిక్తతలకు దారి తీసింది. 


కక్ష సాధింపులు బాగానే అంటున్న ఎంపీపీ వర్గం 


తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కేసినేని చిన్ని తన అనుచరులతో కలిసి కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్ళడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి నేతలు ఎంపీపీపై కక్ష పెట్టుకున్నారని, ఈ క్రమంలోనే ఇంటిని కూల్చివేతకు సిద్ధమైనట్లు ఎంపీపీ వర్గీయులు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించారని, కానీ తమకు నోటీసులు ఇస్తున్నారని ఎంపీపీ నాగలక్ష్మి చెబుతున్నారు.  భవనానికి వెనుక వైపు ఉన్న స్థలాన్ని ఆక్రమించారంటూ ఎంపీపీ నాగలక్ష్మికి కంభంపాడు పంచాయతీ కార్యదర్శి నోటీసు జారీ చేశారు.