Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్ష కింద దాదాపు లక్ష మందిని మెరుగైన వైద్యానికి రెఫరల్‌కు పంపించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు అన్నారు. కేవలం రిఫరల్ తో ఆగిపోకుండా చికిత్స అనంతరం తిరిగి గ్రామాలకొచ్చాక కూడా ఆయా పేషంట్లు ఏమేరకు సంతృప్తి పొందారో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి బాగుందని సంతృప్తి చెందే వరకూ ప‌ర్యవేక్షించాలని సీఎం జగన్ మో‌హన్ రెడ్డి సూచించారని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇప్పటి వరకు 55 లక్షల మంది ఓపీకి వచ్చినట్లు చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు.


ఆకస్మిక తనిఖీలు
మంగళగిరి టిడ్కో కాలనీ, మార్కండేయ కాలనీ యూపీహెచ్‌సీలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ‌రోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ  హ‌రీంద‌‌ర ప్రసాద్, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రావణ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ బ్రోచర్ ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారా లేదా అని అధికారులను కృష్ణబాబు అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన రోగులు, వృద్ధులు, గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ బ్రోచర్లోని సమాచారాన్ని చదివారా అని రోగులను అడిగారు. 


ఆరోగ్య శ్రీ యాప్ ను ఏఎన్ఎంలు  డౌన్లోడ్ చేయిస్తున్నా‌రా లేదా అని ప్రశ్నించారు. జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగులు, ఫోల్డర్లు సరిపడా ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. డాక్టర్ దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ గతంలో ఒక యూపీహెచ్‌సీ పరిథిలో ఒక జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించాలనుకున్నట్లు చెప్పారు. అయితే ప్రతి వార్డు సచివాలయంలో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. 


ముమ్మరంగా ఆరోగ్య శ్రీ యాప్ డౌన్‌లోడ్లు
ఆరోగ్య శ్రీ యాప్‌లను  వాలంటీర్ల ద్వారా డౌన్లోడ్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు కృష్ణబాబు చెప్పారు. యాప్ ద్వారా సమీపంలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు, ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు వంటి సమాచారం యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అలాగే ఆరోగ్య శ్రీకి సంబంధించి పూర్తి సమాచారంతో ముద్రించిన బ్రోచర్లను కూడా ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 12 వేలకు పైగా శిబిరాల్ని నిర్వహించామని, సరాసరి 450 ఓపీలు నమోదైనట్లు పేర్కొన్నారు. వీరందరికీ పరీక్షలు, మందులతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల్ని ఉచితంగా అందించామన్నారు. మెరుగైన వైద్యం అవసరం అయిన వారిని రెఫరల్ కూడా చేశారన్నారు. 


ఆరోగ్య శ్రీ గురించి ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించామన్నారు. పేద ప్రజలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య  వచ్చినా ప్రభుత్వం నుంచి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమన్నా‌రు. ఆరోగ్య శ్రీపై  ప్రజలకు  విస్తృతమైన అవగాహన కల్పించేందుకు 45 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ యాప్ ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసేందుకు ఏఎన్ ఎం/సీహెచ్‌ఓలు వాలంటీర్ల తో కలిసి పనిచేస్తారని కృష్ణ బాబు తెలిపారు. గ్రామాల్లో అక్కడికక్కడే పూర్తి స్థాయి షుగ‌ర్ పరీక్షలు చేయడానికి చర్యలు, తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కమిషనర్ నివాస్ , ఆరోగ్య శ్రీ సీఈఓ హరీందర ప్రసాద్‌ను ఆదేశించారు.