టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌తో అల్లాడుతోన్న రైతాంగాన్ని త‌క్షణ‌మే ఆదుకోవాలని లోకేశ్ సీఎం జగన్‌ను కోరారు. ఎండిన పంట‌లను చూస్తే గుండె త‌రుక్కుపోతోందని.. పంట‌ల్ని రైతులు త‌గ‌ల‌బెడుతుంటే క‌ళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. వ‌రి వేసిన పొలాల్లో ఉరి వేసుకుంటోన్న రైతుల్ని చూస్తే హృద‌యం ద్రవించిపోతోందని అన్నారు. 


‘‘నీరు వ‌దిలి పంట‌ల్ని కాపాడాలంటూ అధికారుల కాళ్లపై ప‌డి ప్రాధేయ ప‌డుతున్న అన్నదాత‌లు, సాగు నీటి కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న రైతులే రాష్ట్రమంతా క‌నిపిస్తున్నారు.  ప్రభుత్వం త‌క్షణ‌మే స్పందించ‌క‌పోతే ఆంధ్రప్రదేశ్‌ రైతుల్లేని రాష్ట్రం అయ్యే ప్రమాదం పొంచి వుంది.


మీ పాలనలోనే తక్కువ వర్షం - లోకేశ్


రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు ఎన్నడూ లేవు. తొలిసారి అతి తక్కువ వర్షపాతం మీ పాలనలో నమోదైంది. రైతు ఆత్మహ‌త్యల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. అనేక మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను కేంద్రానికి నివేదించడంలో విఫలమైంది మీ ప్రభుత్వం. ఖరీఫ్ పంటలే నీటికి కటకటలాడుతుంటే, రబీ సాగు ప్రశ్నార్థకమే. కొన్ని ప్రాజెక్టులలో నీటి నిల్వ లేదు, మరికొన్ని ప్రాజెక్టుల్లో నీరున్నా.. పంటలు ఎండిపోతున్నా వ‌ద‌ల‌రు. ఈ అస్తవ్యస్థ పరిస్థితుల్ని ప్రజలకి వివరించేందుకు వ‌చ్చిన చంద్రబాబు గొంతు నొక్కేందుకు తప్పుడు కేసులు పెట్టి జైలులో బంధించారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఆయ‌న‌ని జైలులో నిర్బంధించే కుట్రల‌పై స‌మీక్షించే స‌మ‌యం ఉంది కానీ, క‌రువుపై సమీక్షించే తీరిక లేని సీఎం ఉండడం ప్రజల దురదృష్టం.


పెన్నా, తుంగభద్ర కాలువల కింద, కృష్ణా డెల్టాలోనూ సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వరి, మిర్చి, పత్తి, వేరుశనగ పూర్తిగా దెబ్బతిన్నాయి. బోర్లు, బావుల నుంచి నీరందించి పంటలు కాపాడుకుందామంటే కరెంటు కోతలతో సాధ్యం కావడంలేదు. రైతులని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి.  యుద్ధప్రాతిప‌దిక‌న‌ కరువు మండలాలని గుర్తించి కేంద్రానికి నివేదిక పంపాలి. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలి. పంట‌ నష్టం అంచనా వేసి రైతుల‌కు నష్ట పరిహారం తక్షణమే అందించాలి.


పిచ్చికి లండన్ మందులు - నారా లోకేశ్
కక్ష సాధింపుకి మానవ రూపం  జగన్. పిచ్చి కి లండన్ మందులు వాడుతున్నట్టే.. కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిది. జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ చంద్రబాబు గారిపై కేసు పెట్టడం వింతగా ఉంది. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చు. జగన్ నీకో చిన్న జే బ్రాండ్ ఛాలెంజ్.. రాష్ట్రంలో నువ్వు పెట్టిన ఏ లిక్కర్ షాపు ముందైనా నేను చర్చకు రెడీ..ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతుందో తేల్చుకుందాం సిద్ధమా? నిన్ను మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే టైం అండ్ డేట్ ఫిక్స్ చెయ్యి. కక్ష సాధింపు లో నువ్వు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ బ్రదర్!’’ అని నారా లోకేష్ లేఖ రాశారు.